TG Government: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రూ. కోటి ఉచిత బీమా.. డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వ (TG Government)ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్ల సంక్షేమం ఉచిత ప్రమాద బీమా పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో కీలక ప్రకటన చేశారు.
Telangana govt announced 1 crore free accident insurance for employees and pensioners
- ఉద్యోగులకు రూ.కోటి ఉచిత బీమా
- 12.91 లక్షల మందికి లబ్ధి
- ప్రభుత్వంపై రూపాయి భారం లేదు
TG Government: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్ల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ప్రమాద బీమా పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో కీలక ప్రకటన చేశారు. ప్రమాదవశాత్తూ ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే మానవీయ ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా రూ.కోటి ఉచిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వంపై కానీ, ఉద్యోగులపై కానీ పైసా భారం పడకుండా బ్యాంకర్ల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు.
12.91 లక్షల మందికి లబ్ధి.. క్రమం తప్పకుండా చెల్లింపులు పూర్తి:
ఈ ప్రమాద బీమా పథకం(TG Government) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,91,056 మంది ఉద్యోగ, పెన్షనర్ వర్గాలకు భరోసా లభిస్తోందని భట్టి వివరించారు. వీరిలో 5,18,293 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 5,00,158 మంది తాత్కాలిక, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, సెర్ప్ సిబ్బంది, 2,72,600 మంది పెన్షనర్లు ఉన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు వచ్చిన 98 క్లెయిమ్లను వేగంగా పరిష్కరించి బాధితుల కుటుంబాలకు కోట్ల రూపాయల పరిహారాన్ని నేరుగా అందించినట్లు శాసనసభ వేదికగా తెలిపారు.
ఉచిత బీమాతో పాటు ప్రత్యేక హెల్త్కార్డులు.. భట్టి విక్రమార్క వెల్లడి:
ప్రమాద బీమా సౌకర్యంతో పాటు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అందుకోసం కార్పొరేట్ తరహా వైద్యం అందించేలా ప్రత్యేక హెల్త్కార్డులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటూ, సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలను వేగంగా అమలు చేస్తోందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
