MMTS Trains : హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. ఆ ట్రైన్స్లో ఉచిత ప్రయాణం..
MMTS Trains : హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. నగరంలోని మధ్య తరగతి, సామాన్య ప్రజలకు రవాణా భారాన్ని తగ్గించడం, ట్రాఫిక్కు చెక్ పెట్టడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
MMTS Trains Free travel
- హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం
- జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం
MMTS Trains Free Travel : హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. నగరంలోని మధ్య తరగతి, సామాన్య ప్రజలకు రవాణా భారాన్ని తగ్గించడం, ట్రాఫిక్కు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు అనే తేడాలేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రాతిపదికన ఏడాది పాటు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Also Read : IPL 2026 : వారి వల్లే మేము గెలిచాం.. నాపై ఒత్తిడి చాలా తగ్గింది.. ఇషాన్ కిషన్ కీలక కామెంట్స్
ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్ల ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఏడాదికి దక్షిణ మధ్య రైల్వేకు రూ.10కోట్ల ఆదాయం వస్తున్నట్లు అంచనా. ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక పెరిగే ప్రయాణికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రస్తుత ఆదాయాన్ని తాము ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు ఇటీవల సమావేశమై చర్చించినట్లు తెలిసింది.
ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, పురపాలక అభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ తాజాగా దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలను లేఖలో ప్రస్తావించారు. జూన్ 2 నుంచి ఏడాది పాటు ఈ పథకాన్ని అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. ఈ లేఖకు దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. ఎంఎంటీఎస్లలో ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ముసాయిదా ఎంవోయూను పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ముసాయిదా ఎంవోయూను పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి తీసుకుంటామని పేర్కొంది.
దక్షిణ మధ్య రైల్వే కు జయేశ్ రంజన్ రాసిన లేఖలో కీలక విషయాలను ప్రస్తావించారు. రద్దీ వేళల్లో ఎంఎంటీఎస్ ట్రిప్పుల సంఖ్య పెంచాలని కోరారు. సమయపాలనను మెరుగుపర్చాలని, ఎంఎంటీఎస్ స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపర్చాలని పేర్కొన్నారు. ప్రయాణికుల కోసం ఇంటి నుంచి స్టేషన్ కు , స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందకు వీలుగా ఆర్టీసీ షటిల్ బస్సులు నడుపుతాం.. వాటికి రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో స్థలాలను కేటాయించాలని కోరారు. దీనికి దక్షిణ మధ్యరైల్వే స్పందిస్తూ.. ఎన్ని రైళ్లు నడపాలి, ఏయే సమయాల్లో నడపాలన్నది దక్షిణ మధ్య రైల్వే నిర్ణయిస్తుంది. రైల్వేబోర్డు నిబంధనల ప్రకారం స్టేషన్లలో సౌకర్యాలు కల్పిస్తామని వివరించింది.
