HYDRAA : హైడ్రా పేరుతో బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్.. ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక..!
HYDRAA : ఈ సంఘటన గండిపేట మండలం నెక్నాంపూర్ గ్రామంలోని అల్కాపూర్ టౌన్షిప్లో జరిగింది. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

HYDRAA officials
HYDRAA : హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని అల్కాపురి టౌన్ షిప్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ (HYDRAA) వద్దకు వెళ్ళి హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు వారిద్దరిపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
అక్రమంగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్ను కూల్చేస్తామని మిరియాల వేదాంతం, యెలిసెట్టి శోభన్ బాబు బెదిరించారు. నిందితులు హైడ్రా అధికారులుగా చెప్పుకుని బెదిరించి డబ్బు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. దాంతో రంగంలోకి దిగిన హైడ్రా నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుంది.
కరీంనగర్ జిల్లాకు చెందిన డ్రైవర్ వేదాంతం ప్రస్తుతం అల్కాపూర్ టౌన్షిప్లో నివసిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రెండవ నిందితుడు శోభన్ బాబు మణికొండలోని పుప్పాలగూడలోని ఎస్టీమ్ రెసిడెన్సీలో నివసిస్తున్న రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి. ఇద్దరినీ తదుపరి విచారణ కోసం నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైడ్రా అధికారిక (HYDRAA) ప్రకటన :
ఈ సంఘటనపై స్పందించిన హైడ్రా తన పేరును అనధికారికంగా నేర కార్యకలాపాలకు ఉపయోగించడాన్ని ఖండిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తులతో తమకు ఎలాంటి సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది. బెదిరింపులు, మోసం లేదా ఏదైనా చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడుతూ ఎవరైనా తమ పేరును దుర్వినియోగం చేస్తే.. కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైడ్రా హెచ్చరించింది.
తమ సొంత ఉద్యోగుల్లో ఎవరైనా బ్రాండ్ గుర్తింపును దుర్వినియోగం చేసినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. హైడ్రా పేరుతో ఎవరైనా దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడితే 8712406899 నంబరుకు ఫోన్ చేసి సమాచారాన్ని అందజేయాలని ప్రజలకు హైడ్రా విజ్ఞప్తి చేసింది.