క్యాబినెట్ దండుపాళ్యం ముఠాలా తయారైందన్న హరీశ్.. సీఎం, మంత్రుల మధ్య టగ్‌ ఆఫ్‌ వార్ నడిచిందా?

పంపకాలు, పర్సనల్ పంచాయితీల కోసమే క్యాబినెట్ భేటీ అంటూ హడావుడి చేస్తున్నారని కారు పార్టీ లీడర్లు మండిపడుతున్నారు.

క్యాబినెట్ దండుపాళ్యం ముఠాలా తయారైందన్న హరీశ్.. సీఎం, మంత్రుల మధ్య టగ్‌ ఆఫ్‌ వార్ నడిచిందా?

Updated On : October 27, 2025 / 8:40 PM IST

Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు రంజు మీదున్నాయ్. అధికార, ప్రతిపక్షాలు ఏ మాత్రం తగ్గడం లేదు. సమయం దొరికిన ప్రతీసారి కాంగ్రెస్‌ను కార్నర్ చేయడంలో బీఆర్ఎస్‌ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే క్యాబినెట్‌ భేటీ చుట్టూ తెలంగాణ రాజకీయం హీటెక్కుతోంది. క్యాబినెట్‌లో పర్సనల్ పంచాయితీలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మంత్రులు గ్రూపులుగా విడిపోయి తిట్టకున్నారని..హరీశ్‌ రావు అలిగేషన్స్‌ చేశారు.

అంతేకాదు రాష్ట్ర క్యాబినెట్ దండుపాళ్యం బ్యాచ్‌గా మారిపోయిందని సీరియస్ కామెంట్సే చేశారు హరీశ్‌రావు. అయితే క్యాబినెట్ మీటింగ్‌లో పర్సనల్ విషయాలు చర్చకు రాలేదంటున్న మంత్రులు..కావాలనే తమను బద్నాం చేస్తున్నారని హరీశ్‌ రావుపై మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. చేసిన ఆరోపణలపై ప్రమాణానికి రావాలని హరీశ్‌ రావుకు మంత్రి అడ్లూరి సవాల్‌ విసిరారు.

ఇక హరీశ్‌ రావుకు మద్దతుగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వాయిస్‌ రేజ్‌ చేశారు. చర్చకు సిద్ధమంతూ ట్యాంక్‌ బండ్‌ దగ్గరున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. హరీశ్‌రావు గడ్డ మీదకు వెళ్లి తాను సవాల్‌ విసిరానని..అయితే ఆయన మొహం చాటేసుకుని వెళ్లిపోయారని అడ్లూరి రివర్స్ అటాక్ చేస్తున్నారు.

Also Read: ఏపీలోనూ హైడ్రా మోడల్.. పవన్‌ ప్లాన్ అదేనా..? నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటి? ఇక బుల్డోజర్లు..

పోటాపోటీ సవాళ్లు, ప్రతిసవాళ్లతో అందరి దృష్టి క్యాబినెట్ భేటీపై పడింది. ఇంతకు ఈ నెల 23న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగిందనే చర్చకు తెరమీదకు వచ్చింది. ఆ క్యాబినెట్ భేటీ జరగడానికి ముందు మంత్రి జూపల్లి, ఐఏఎస్‌ రిజ్వీ వివాదం..అంతకు ముందు కొండా సురేఖ, పొంగులేటి ఎపిసోడ్‌ రచ్చరంబోలా అయింది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌ భేటీలో ఫుల్ సీరియస్‌ అయ్యారని..మంత్రులను లెఫ్ట్‌ అండ్ రైట్ తీసుకున్నారని అంటున్నారు.

అంతేకాదు అమాత్యులు కూడా ఎక్కడా తగ్గలేదని..మంత్రులు జూపల్లి, పొన్నం, కొండా సురేఖ కూడా సీరియస్‌గానే రియాక్ట్‌ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. మీరు వాటాల కోసం కొట్లాడుకుంటే మళ్లీ గెలవమని రేవంత్‌ అంటే..తమ శాఖల్లో వేలు పెట్టొద్దని మంత్రులు సీఎంకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు చెప్పకుండా చెక్‌పోస్టులు ఎలా రద్దు చేస్తారని పొన్నం ప్రభాకర్ నిలదీసినట్లు ఇన్‌ సైడ్‌ టాక్. తన ఆదేశాలనే పాటించనప్పుడు మంత్రి పదవి ఎందుకని జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారట.

“కాంట్రాక్టుల” సమస్యను రేవంత్ రెడ్డి సెటిల్ చేశారా?
సేమ్‌టైమ్‌ కొండా సురేఖ, పొంగులేటి కాంట్రాక్టుల సమస్యను కూడా రేవంత్ రెడ్డి సెటిల్ చేసినట్లు సెక్రటేరియట్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరికి ఎలాంటి సమస్య ఉన్న తనకు చెప్పాలని రేవంత్ రెడ్డి మంత్రులను పదే పదే కోరారని..మీడియా ముందు ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారని అంటున్నారు.

అంతేకాదు తెలంగాణలో రేవంత్‌ ప్రభుత్వం ఫెయిల్ అని ఏఐసీసీ చీఫ్ ఖర్గే అన్నట్లుగా జరుగుతోన్న ప్రచారంపై మండిపడ్డారట రేవంత్. తనను ఫెయిల్యూర్‌ సీఎంగా చూపించే కుట్ర జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ అమాత్యులపై ఫైర్ అయ్యారట రేవంత్. తాను ఫెయిల్ అయితే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కూడా విఫలమైనట్లు కాదా అని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

అయితే క్యాబినెట్‌ భేటీ తర్వాత ఇన్ని విషయాలు బయటికి వచ్చాయంటే..ఇక సమావేశంలో చర్చించిందేముంటుందన్న టాక్‌ వినిపిస్తోంది. మంత్రులతో సెపరేట్‌గా మాట్లాడారట సీఎం. అధికారులను బయటికి పంపించి..ప్రత్యేకంగా సీఎం, మంత్రులే కొద్దిసేపు వాదనకు దిగారని అంటున్నారు. ఆ తర్వాత ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత ప్రస్తావన మంత్రి వర్గ సమావేశాన్ని మమ అనిపించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నెల 23న జరిగిన క్యాబినెట్‌ భేటీలో ఒక్క ప్రజా సమస్యపై కూడా చర్చ జరగలేదని..పక్కా పర్సనల్ విషయాల కోసమే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారని అంటోంది.

ఈ క్రమంలోనే రాష్ట్ర క్యాబినెట్ దండుపాళ్యం ముఠాలా తయారైందంటూ మాజీమంత్రి హరీశ్‌రావు మాట్లాడాల్సి వచ్చిందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. పంపకాలు, పర్సనల్ పంచాయితీల కోసమే క్యాబినెట్ భేటీ అంటూ హడావుడి చేస్తున్నారని కారు పార్టీ లీడర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో స్టేట్‌ క్యాబినెట్‌ భేటీ చుట్టూ..రాష్ట్ర రాజకీయం తాండవం చేస్తోంది. అయితే మంత్రివర్గ సమావేశంలో ఏం చర్చించారనే దానిపై మాత్రం ఓ క్లారిటీ రాని పరిస్థితి ఉంది.