రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి 2025 ప్రకటన.. ఈ సారి ముగ్గురికి.. వీళ్లు దేనిపై కృషి చేశారంటే?

నోబెల్ సాహిత్య బహుమతిని రేపు ప్రకటించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటన శుక్రవారం వెలువడనుంది.

రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి 2025 ప్రకటన.. ఈ సారి ముగ్గురికి.. వీళ్లు దేనిపై కృషి చేశారంటే?

Updated On : October 8, 2025 / 6:46 PM IST

Nobel Prize 2025: రసాయన శాస్త్రంలో 2025 నోబెల్ బహుమతి శాస్త్రవేత్తలు సుసుము కిటగావా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాఘీకి లభించింది. వారు ‘మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ అభివృద్ధి’కి కృషి చేశారని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది.

ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతితో పాటు ఈ ముగ్గురు రసాయన శాస్త్రవేత్తలు 11 మిలియన్ స్వీడిష్ క్రౌన్ల నగదును అందుకుంటారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.10 కోట్లు.

జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయం నుంచి హైడ్రోకార్బన్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పొందిన కిటగావా ఇప్పటికే హుంబోల్ట్ రీసెర్చ్ ప్రైజ్ (2008), డి జెన్నెస్ వంటి బహుమతులు పొందారు. ప్రస్తుతం క్యోటో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

రాబ్సన్ యూకేలో జన్మించి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ చదివారు. ప్రస్తుతం మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో విధుల్లో నిర్వర్తిస్తున్నారు.

Also Read: ఇప్పటివరకు ఎవరూ చూడని “విడాకుల వేడుక”.. బ్రేకప్‌ అయితే కన్నీళ్లు పెట్టుకునే రోజులు పోయాయ్‌..

జోర్డాన్‌లో జన్మించిన యాఘీ.. యునైటెడ్ స్టేట్స్‌లోని ఇల్లినాయిస్ ఉర్బానా-షాంపెయిన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లోని కాలిఫోర్నియా-బర్క్లీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు.

“ఈ నిర్మాణాలు, మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్, ఎడారి గాలిలో నుంచి నీటిని సేకరించేందుకు, కార్బన్ డయాక్సైడ్‌ను పట్టుకునేందుకు, విష గ్యాసులను నిల్వ చేసేందుకు లేదా రసాయన ప్రతిక్రియలను ప్రేరేపించేందుకు ఉపయోగపడతాయి” అని జ్యూరీ తెలిపింది.

“మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ అపారమైన సామర్థ్యం కలిగి ఉంటాయి” అని నోబెల్ కమిటీ ఫర్ కెమిస్ట్రీ అధ్యక్షుడు హైనర్ లింకే ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.

గత సంవత్సరం రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి డేవిడ్ బేకర్, జాన్ జంపర్, బ్రిటన్ డెమిస్ హస్సాబిస్‌కు లభించింది. వారు కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు ద్వారా ప్రోటీన్ల నిర్మాణ కోడ్‌ను విప్పినందుకుగానూ ఈ పురస్కారం దక్కింది. నోబెల్ సాహిత్య బహుమతిని రేపు ప్రకటించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటన శుక్రవారం వెలువడనుంది. డిసెంబర్‌ 10న విజేతలకు పురస్కారాలను ప్రదానం చేస్తారు.