రాజధాని ప్రాంతంలో వారికి భూములు తిరిగి ఇవ్వనున్న ప్రభుత్వం

  • Published By: vamsi ,Published On : December 19, 2019 / 04:51 AM IST
రాజధాని ప్రాంతంలో వారికి భూములు తిరిగి ఇవ్వనున్న ప్రభుత్వం

Updated On : December 19, 2019 / 4:51 AM IST

రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన అసైన్డ్ భూములను అసలు హక్కుదారులకే తిరిగి ఇచ్చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసినవారికి ల్యాండ్‌ పూలింగ్‌ కింద సీఆర్‌డీఏ కేటాయించిన ప్లాట్లను ప్రభుత్వం రద్దు చేసింది. టీడీపీ హయాంలో ల్యాండ్‌ పూలింగ్‌ చట్టం 2015 ప్రకారం రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించారు.

అయితే దళితులు, పేదలకు మంజూరు చేసిన అసైన్డ్‌ భూములను కొందరు రాజకీయ నేతలు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారు. అనంతరం సీఆర్‌డీఏ వీటిని భూ సమీకరణ కింద సేకరించి బదులుగా వారికి వాణిజ్య, నివాస స్థలాలను కేటాయించింది. అసైన్డ్‌ భూములను కొనుగోలు చేయడం ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ యాక్ట్‌ (పీవోటీ) 1977 ప్రకారం చట్ట విరుద్ధం. దీంతో అసైన్డ్‌ భూములు సేకరించి బదులుగా వారికి ప్లాట్లు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.

ల్యాండ్‌ పూలింగ్‌ కింద మెట్ట ప్రాంతంలో ఎకరా భూమి తీసుకుంటే 500 గజాల నివాస స్థలం, 50 గజాల వాణిజ్య స్థలం, జరీబు భూములకైతే 500 గజాల నివాస స్థలం, 100 గజాల వాణిజ్య ప్లాట్లు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం అసైన్డ్‌ ప్లాట్ల కేటాయింపులు రద్దు చేయాలని తీర్మానం చేసింది. ఈ క్రమంలో అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన వారికి సీఆర్‌డీఏ కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.