ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : కొత్త డ్రైవర్ల నిర్లక్ష్యం.. పెరుగుతున్న ప్రమాదాలు

ఆర్టీసీ సమ్మెతో తాత్కాలికంగా డ్రైవర్లను, కండక్టర్లను నియమిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ..డ్రైవర్ల నిర్లక్ష్య కారణంగా రాష్ట్రంలో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 14వ తేదీ సోమవారం కూకట్ పల్లిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటన మరిచిపోకముందే..మరో ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డిలో ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. సదాశివనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో ఉన్న పలువురికి గాయాలయ్యాయి.
కొందరి తలలు పగలగా, మరికొందరికి చేతులు, కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. నర్సాపురం నుంచి వెళుతున్న ఆర్టీసీ బస్సును తాత్కాలికంగా నియమించబడిన డ్రైవర్ నడుతుపున్నాడు. సంగారెడ్డి నుంచి వెళుతున్న ఆటోను బస్సు ఢీకొంది. గాయాలపాలైన ముగ్గురిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది.
ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తర్ఫీదు లేని వారిని డ్రైవర్లుగా నియమిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ కూకట్పల్లి వై జంక్షన్ సమీపంలో ఆర్టీసీ బస్సును వెనుక నుంచి .. మరో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అటు బస్సును నిర్లక్ష్యంగా నడిపిన హైదరాబాద్-2 డిపోకి చెందిన తాత్కాలిక డ్రైవర్ను. ప్రయాణికులు చితక్కొట్టారు.
భూపాలపల్లి ఆర్టీసీ సమ్మెలో భాగంగా కొత్త డ్రైవర్లకు .. టెస్ట్ డ్రైవింగ్ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. బస్ ట్రాక్ మీద బస్సు నడుపుతుండగా అకస్మాత్తుగా బస్సు అదుపుతప్పి ఫిట్ గ్యారేజ్లోకి దూసుకెళ్లింది. అయితే పెను ప్రమాదం తప్పినా.. రెండు లక్షల రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది.
Read More : సీపీఐ నేతలకు కేకే ఫోన్ : మద్దతు ఉపసంహరించవద్దు