పవన్ కళ్యాణ్ పై జీవీఎల్ హాట్ కామెంట్స్
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయి పవన్ కళ్యాణ్ “ప్యాకేజి కళ్యాణ్” అయిపోయాడని జీవీఎల్ విమర్శించారు. అందుకే చినబాబు, పెద్దబాబు గురించి ఎక్కడా పల్లెత్తు మాట అనట్లేదని ఆయన అన్నారు. ప్యాకేజి కళ్యాణ్ నిజ జీవితంలో అద్భుతంగా నటిస్తున్నారని, కనీసం మంగళగిరి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని తెలిపారు. ఇకనైనా ప్యాకేజి కళ్యాణ్ నాటకాలకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు.
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మాటలు ఎవరూ నమ్మటం లేదని , చెప్పిందే చెప్పి ప్రజలను విసిగిస్తున్నాడని, ఆయన్ని జనం పట్టించుకోవటం మానేశారన్నారు. అందుకే ఇతర రాష్ట్రల నుంచి నాయకులను దిగుమతి చేసుకుని ప్రచారం చేయించుకుంటున్నారని జీవిఎల్ అన్నారు. గడిచిన 5 ఏళ్లల్లో రాష్ట్రానికి ఏం చేశానో చెప్పుకోలేని స్టిక్కర్ బాబు కేంద్ర పధకాలు తన పధకాలుగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో మోడీ హవా నడుస్తోందని, మోడీ ఎన్డీఏ ఒకవైపు, భంగ పడిన ప్రతిపక్షాలు మరోవైపు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలన్నీ కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయాయని, బీజేపీ 300 పైగా స్దానాల్లోగెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఓటమి భయం పట్టుకునే రాహుల్ గాంధీ 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. కేరళ వంటి రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీలతోనూ ఒప్పందం చేసుకుని పోటీకి దిగారని జీవిఎల్ విమర్శించారు.