దేశ రాజకీయాల్లో కోడెల ఆత్మహత్య ఒక కేసు స్టడీ ..చంద్రబాబు
దేశ రాజకీయాల్లో కోడెల ఆత్మహత్య ఒక కేసు స్టడీ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఇండియన్ పాలిటిక్స్లో ఒక తప్పుచేయని వ్యక్తిపై దుష్ప్రచారం చేసి ఎలా సూసైడ్ చేసుకోవచ్చో కోడెల సూసైడ్ ఒక ఉదాహరణ అని అన్నారు. సీఎం జగన్ సొంత పత్రిక, ఛానల్ లో కోడెలపై దుష్ప్రచారం చేసి ప్రజలను తప్పు దోవ పట్టించారని ఆయన తెలిపారు. ఫర్నీచర్ తీసుకువెళ్లమని కోడెల లెటర్స్ రాసినా తీసుకు వెళ్ళకుండా, దానిపై తప్పుడు వార్తలు ప్రచారం చేసారని ఆరోపించారు. ఫర్నీచర్ తీసుకెళ్ళాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, వాళ్ళ తప్పిదానికి కోడెలను బాధ్యుడిని చేసి మానసికంగా హింసించారని ఆరోపించారు.
కోడెలపై 18 కేసులు పెట్టి శారీకంగా, మానసికంగా, హింసించి, వేధించి, అవమానాల పాలు చేసి ఆయన సూసైడ్ చేసుకునేలా చేశారని చంద్రబాబు అన్నారు. కోడెల సూసైడ్ చేసుకోటానికి సోషల్ మీడియా కూడా ఒక కారణమని చంద్రబాబు ఆరోపించారు. విజయసాయిరెడ్డి లాంటి నేరస్ధులు కొందరు సోషల్ మీడియాలో కోడెలపై రెచ్చ గొట్టేలా వ్యాఖ్యలు చేసి ఇతరులతో కోడెలను తిట్టించి అవమానాల పాల్జేశారన్నారు.
కోడెల సూసైడ్ లో పోలీసులు కూడా అత్యుత్సాహంతో పని చేశారని….విధులకు అడ్డం పడుతున్నారనే నెపంతో…ఏసెక్షన్ పడితో ఆ సెక్షన్ పెట్టి కేసులు నమోదు చేశారన్నారు. స్టేషన్ బెయిల్ వచ్చే కేసులకు కూడా బెయిల్ ఇవ్వకుండా వేధించి, ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసులతో సహా 18 కేసులు పెట్టారన్నారు. వీళ్ల నాయకుడు నేర స్వభావం కలిగిన వాడవటంతో మీడియాను కూడా బెదిరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని చంద్రబాబు తెలిపారు. కోడెలపై పోలీసులు పెట్టిన కేసుల్లోని లొసుగులను చంద్రబాబు వివరించారు.