నిజామాబాద్ లో ఇద్దరు యువకులు దారుణ హత్య
నిజామాబాద్ : జిల్లాలోని కంఠేశ్వర్ లో జంట హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. ఈఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చిన ఏసీపీ శ్రీనివాస్ రావు పరిశీలించారు. హత్యకు గురయినవారిద్దరు కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు.
శ్రీకాంత్, సాయి, మహేశ్ అనే ముగ్గురు యువకులు కంఠేశ్వర్ కాలనీలో ఓ ఇంట్లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. హత్యకు గురయిన వీరిద్దరు శ్రీకాంత్, సాయిలుగా గుర్తించారు.
నాలుగు నెలల క్రితం ముగ్గురు యువకులు కలిసి ఓ ఇంట్లో అద్దెకు తీసుకుని ముగ్గురు కలిసి టీ స్టాల్ నడుపుకుంటున్నారు. గత రెండు రోజుల నుంచి గదికి తాళం వేసి ఉండడం, ఆ గదిలో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా రక్తపుమడుగులో పడి ఉన్న ఇద్దరు యువకులను చూసి యజమాని షాకయ్యాడు.
అనంతరం నిజామాబాద్ మూడో టౌన్ పోలీసులకు ఇంటి యజమాని సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మరో యువకుడు మహేశ్ ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. మూడు రోజుల క్రితమే వీరు హత్యకు గురైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా ముగ్గురు మధ్య తలెత్తిన విభేదాలతో మహేశ్ అనే యువకుడు వీరిద్దని హత్య చేసి పరారయ్యాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.