శామీర్పేటలో బాలుడి మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
Missing boy: హైదరాబాద్ శామీర్పేటలో బాలుడు అదియాన్ మృతికేసు మరో మలుపు తీసుకుంది. అదియాన్ అదృశ్యం కాలేదని తేల్చారు పోలీసులు. ప్రమాదవశాత్తు చనిపోయాడని నిర్ధారించారు. మిస్సింగ్, కిడ్నాప్ అంటూ హంగామా చేసిన యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో అదియాన్ మృతదేహాన్ని గుర్తించారు. మరోవైపు బాలుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
టిక్ టాక్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతి:
బాలుడు అదియాన్ టిక్టాక్కు బాగా అడిక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే టిక్ టాక్ చేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయాడు. అదియాన్ మృతిని బిహార్కు చెందిన యువకుడు క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. బాలుడి కుటుంబసభ్యులకి కాల్ చేసి అదియాన్ తన దగ్గరే ఉన్నాడని.. అప్పగించాలంటే 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కంగారుపడ్డ కన్నవాళ్లు శామీర్పేట పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో కాల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల విచారణలో నిజం కక్కేసిన బీహార్ యువకుడు:
అదియాన్ తల్లిదండ్రులకు కాల్ చేసిన బిహార్ యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టయిల్లో విచారించడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అదియాన్ డెడ్బాడీ పడేసిన ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు.. స్పాట్కు వెళ్లారు.