రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు దుర్మరణం
road accident : రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి చెందారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ శివారులోని రాగన్నగూడ వద్ద అర్ధరాత్రి కారు, బైకు ఢీకొన్నాయి. హైద్రాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తున్న టాటా సఫారీ కారు AP29BD7111 యమహా ఫాసినో TS07GA2600 బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న తల్లీకొడుకు అక్కడికక్కడే మృతి చెందారు.
కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స కోసం కామినేని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కాగా మృతులు రాగన్నగూడెం జీవీఆర్ కాలనీకి చెందిన తల్లీ కొడుకులు చంద్రకళ (49), ప్రదీప్రెడ్డి (19)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.