స్థానికులకే 95శాతం ఉద్యోగాలు.. రాష్ట్రపతి ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు ఏర్పడినా.. ఉద్యోగాలకు స్థానికత అంశం ఎన్నోరోజుల తర్వాత ఇప్పుడు క్లియర్ అయ్యింది. రాష్ట్రంలో 95శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్రంలో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లతో కూడిన కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో అన్ని రకాల పోస్టుల్లోనూ ఓపెన్ కోటా 5 శాతం మాత్రమే ఉంటుంది. పోలీసు విభాగం మినహా ఇతర శాఖలన్నింటికీ కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది.
వాస్తవానికి 2018లోనే కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం లభించినా.. తర్వాత ప్రభుత్వం మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది, వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్కు మార్చగా.. ఈ మార్పులకు రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి రావడంతో మొత్తం ప్రక్రియకు ఆలస్యమైంది. లేటెస్ట్గా రాష్ట్రపతి ఆమోదంతో కొత్త జోనల్ విధానం అమల్లోకి రాబోతుంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు కొన్ని కేటగిరీల్లో 100 శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీలోనే ఉన్నాయి. గ్రూప్–1లోని డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ వంటి రాష్ట్రస్థాయి (స్పెసిఫైడ్ గెజిటెడ్ కేటగిరీ) పోస్టుల్లో 100 శాతం ఓపెన్ కోటానే. కొన్ని రాష్ట్రస్థాయి పోస్టుల్లో 50 శాతం ఓపెన్ కోటా కిందే ఉన్నాయి.
ఈ పోస్టుల కోసం ఇక్కడివారితోపాటు ఇతర రాష్ట్రాల వారూ పోటీపడి, ఉద్యోగాలు దక్కించుకునేవారు. ఇకపై అటువంటి పరిస్థితి ఉండదు. మల్టీజోన్లు.. వాటి పరిధిలోని జోన్లు విషయానికి వస్తే.. మల్టీజోన్-1లో కాళేశ్వరం-1, బాసర-2, రాజన్న-3, భద్రాద్రి-4 మల్టీజోన్-2లో యాదాద్రి-5, చార్మినార్-6, జోగులాంబ-7 ఉన్నాయి.
గ్రూప్–1 కేటగిరీలోని మిగతా పోస్టుల్లోనూ కొన్ని మల్టీజోన్, మరికొన్ని జోనల్ పోస్టులు ఉండేవి. మల్టీజోన్ పరిధిలో 40 శాతం పోస్టులు, జోనల్లో 30 శాతం, జిల్లా స్థాయిలో 20 శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉండేవి. వాటిల్లో ఇతర రాష్ట్రాల వారు, ఇతర జోన్ల వారు పోటీపడి ఉద్యోగాలు పొందేవారు. ఈ కారణంగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండేవి.
రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త జోనల్ విధానంతో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. జిల్లా పోస్టులతోపాటు 61 కీలక విభాగాల్లోని 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కుతాయి. 5 శాతం పోస్టులు మాత్రమే ఓపెన్ కేటగిరీలో అందుబాటులో ఉంటాయి.