డ్రగ్స్ మాన్పించాలని : యువతిని గొలుసులతో బంధించిన తల్లి
కూతురు డ్రగ్స్ తీసుకోవడం మానడం లేదు..ఎంత చెప్పినా వినలేదు..దీని నుంచి బయటపడేందుకు ఆ తల్లి ప్రయత్నాలు చేసింది..కానీ అవన్నీ ఫెయిల్ అయ్యాయి. చివరకు కూతురుని కాపాడుకొనేందుకు ఓ నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనే ఓ రూంలో గొలుసులతో బంధించి వేసింది. మాదకద్రవ్యాల వాడకంతో జీవితాలు ఎంతటి దారుణస్థితికి దిగజారుతాయో ఈ ఘటన అద్దం పడుతోంది. పంజాబ్ రాష్ట్రంలో ఇది చోటు చేసుకుంది. దీనిపై అమృత్ సర్ ఎంపీ గుర్జీత్ సింగ్ స్పందించారు.
పంజాబ్లోని అమృత్ సర్లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. యువతి..డ్రగ్స్కు బానిసైంది. కన్నతల్లి తీవ్ర ఆవేదన చెందింది. కూతురును అడుగు బయట పెట్టవద్దని..డ్రగ్స్ మానాలని తల్లి చెప్పింది. డ్రగ్స్ మాన్పించేందుకు సర్కార్ ఏర్పాటు చేసిన కేంద్రాల వద్దకు తీసుకెళ్లింది. బయటి ప్రాంతాలతో పోలిస్తే..ఆ కేంద్రం వద్దే మాదకద్రవ్యాల విక్రయదారులు ఎక్కువగా ఉండడం..మహిళలకు ప్రత్యేక కేంద్రాలు లేకపోవడంతో యువతిని ఇంటికి తీసుకొచ్చింది ఆ తల్లి. ఓ రూంలో బెడ్పై కూతురును కూర్చొబెట్టి..గొలుసులతో కాళ్లను బంధించింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
అమృత్ సర్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఔజ్లా ఆమె ఇంటికి వెళ్లారు. తల్లి..యువతితో మాట్లాడారు. డ్రగ్స్ మాన్పించేలా ఇంట్లోనే ఆమెకు చికిత్స అందిస్తామని హామీనిచ్చారు. తన పీజీ చదువు చండీగడ్లో కొనసాగిందని..అక్కడ తన స్నేహితుల ద్వారా డ్రగ్స్ అలవాటు అయ్యిందని ఆ యువతి తెలిపింది. ఎలాంటి వత్తిడిలు ఉండవని..తెలపడంతో తాను వాడినట్లు..అది ఒక వ్యసనంలాగా మారిపోయిందని వాపోయింది.