కొత్త మోటార్ వెహికల్ చట్టం : ట్రక్కు డ్రైవర్కు రూ. 86 వేల ఫైన్
కొత్త మోటార్ వెహికల్ చట్టం వాహదారుల్లో బెంబేలెత్తిస్తోంది. భారీగా ఫైన్లు పడుతుడడంతో ఏమీ చేయాలో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తనకు విధించిన జరిమానాను కట్టలేనని..స్కూటీని వదిలేసి ఓ వ్యక్తి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. వేలల్లో ఫైన్లు పడుతుడడంతో వాహనదారులు రోడ్డు మీదకు రావాలంటే జంకుతున్నారు. తాజాగా ఓ ట్రక్కు డ్రైవర్కు రూ. 86 వేల 500 ఫైన్ విధించారు.
ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో సెప్టెంబర్ 03న చోటు చేసుకుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు. నాగాలాండ్కు BLA ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన ట్రక్కులో జేసీబీని ఛత్తీస్ గడ్కు తరలిస్తున్నారు. దీనిని అశోక్ జాదవ్ నడుపుతున్నాడు. సాంబ్లాపూర్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు జరుపుతున్నారు. ట్రక్కు వాహనానికి సంబంధించిన పత్రాలను ట్రాఫిక్ పోలీసులు చూశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. రూ. 86 వేల 500 కట్టాలని రశీదు చింపి చేతికిచ్చారు.
ఒకరు నడపాల్సిన వాహనాన్ని మరొకరు నడుపుతున్నందుకు రూ. 5 వేలు
లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు రూ. 5 వేలు
18 టన్నుల అధిక బరువు తీసుకెళుతున్నందుకు రూ. 56 వేలు.
పరిమితికి మించిన లోడ్తో వెళుతున్నందుకు రూ. 20 వేలు.
సాధారణ తప్పిదాలకు మరో రూ. 500.
మొత్తం రూ. 86 వేల 500 కట్టాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ఈ సమాచారాన్ని కంపెనీకి తెలియచేశాడు. ట్రాఫిక్ పోలీసు అధికారులతో చర్చలు జరిపిన అనంతరం రూ. 70 వేలు కట్టారు. కొత్త వాహన చట్టం సెప్టెంబర్ 01వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం అదే రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది.
Read More : ట్రాఫిక్ చెకింగ్.. ఫైన్ పడదు : E- డాక్యుమెంట్లు చూపించండి!