AP Power Cut: విద్యుత్లో కోతలు.. పరిశ్రమలతో డిస్కంలు సంప్రదింపులు!
ఇప్పటికే అనధికారికంగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు చేస్తున్న డిస్కం సంస్థలు ఇదే పరిస్థితి కొనసాగితే అధికారికంగానే కోతలకి కూడా సన్నాహాలు చేస్తుంది. ఇదే సమయంలో మరోవైపు పరిశ్రమలతో కూడా..
AP Power Cut: ఇప్పటికే అనధికారికంగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు చేస్తున్న డిస్కం సంస్థలు ఇదే పరిస్థితి కొనసాగితే అధికారికంగానే కోతలకి కూడా సన్నాహాలు చేస్తుంది. ఇదే సమయంలో మరోవైపు పరిశ్రమలతో కూడా సంప్రదింపులు చేస్తున్న చేస్తున్న డిస్కంలు కనీసం వినియోగంలో పది శాతం తగ్గించుకుంటే కోతలు ఉండవని.. లేదంటే పరిశ్రమలకు సైతం కోతలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. పీక్ డిమాండ్ సమయమైన సాయంత్రం 6నుంచి రాత్రి 10గంటలు మధ్య వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకునేలా పరిశ్రమలతో డిస్కంలు సంప్రదింపులు జరుపుతున్నాయి.
అయితే, ఇదే సమయంలో పరిశ్రమలో ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా విద్యుత్ను పొదుపు చేయటానికి ఏసీలు, ఇతర అనవసర వినియోగాన్ని తగ్గించాలని కోరుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ డిమాండ్లో రోజూ 2వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఉండగా దీన్ని అధిగమించటానికి సుమారు వెయ్యి మెగావాట్ల ఉత్పత్తిని పెంచుకొని మరో వెయ్యి మెగావాట్ల వినియోగాన్ని తగ్గించటం ద్వారా సర్దుబాటు చేయాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే లోడ్ సర్దుబాటు కోసం అనధికారికంగా గ్రామాల్లో రోజూ పీక్ లోడ్ సమయంలో కనీసం గంటపాటు సరఫరాలో కోత విధిస్తున్నాయి.
డిస్కంలు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరుతున్నా.. కొవిడ్ పరిస్థితులనుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిశ్రమలకు విద్యుత్ కోత విధిస్తే కోలుకునే పరిస్థితి ఉండదని నిర్వాహకులు వాపోతున్నారు. ప్రత్యామ్నాయ పద్దతులలో ఉత్పత్తికి వెళ్లాలంటే పెరిగిన డీజిల్ ధరలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ఖర్చుతో పోలిస్తే దాదాపు 10రెట్లు అదనంగా ఖర్చవుతుందంటున్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం రోజుకు 185-190 మిలియన్ యూనిట్ల మధ్య ఉండగా.. బహిరంగ మార్కెట్నుంచి సుమారు 40 ఎంయూలు కొన్నా కొరత తీరటం లేదు.
విద్యుత్ కొనుగోలు కోసం యూనిట్కు సగటున రూ.7-8 వంతున డిస్కంలు వెచ్చిస్తున్నాయి. కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాలకు బహిరంగ మార్కెట్లో అధిక ధర వెచ్చించి విద్యుత్ కొంటున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతమున్న విద్యుత్ సమస్య కొలిక్కి రావటానికి కనీసం మరో నెల పడుతుందని అంచనా వేస్తున్న అధికారులు డిస్కంలపై ఒత్తిడి తీస్తుండగా డిస్కంలు గ్రామాలతో పాటు పట్టణాలు.. పరిశ్రమలకు సైతం కొత్త విధించేందుకు సిద్దమవుతుంది. ఫీడర్ లోడ్ ను బట్టి ఈ కోతలు విధిస్తున్నాయి.