ADANI : కాలేజీ డ్రాప్ అవుట్ అయి..భారత వ్యాపారవేత్తల్లో రాఖీభాయ్ అనిపించుకుంటున్న ‘గౌతమ్ అదానీ’..
కాలేజీ డ్రాప్ అయిన వ్యక్తి..భారత వ్యాపారవేత్తల్లో రాఖీభాయ్ అనిపించుకుంటున్నారు గౌతమ్ అదానీ.. వ్యాపారం సామ్రాజ్యం అంతా ఇంతా కాదు. అంబానీని మించి వ్యాపార చతుర ఈ బిజినెస్ దిగ్గజానిది అనటంలో ఏమాత్రం సందేహం లేదు.
ADANI GROWTH : ఇండియా అంటే అదానీ..అదానీ అంటే ఇండియా. వెలుగులు నింపే విద్యుత్ నుంచి వంటనూనెల దాకా..పోర్టుల నుంచి వంట గ్యాస్ వరకు ఇలా ప్రతీ రంగంలో తనదైన ముద్ర వేస్తూ..ముందుకు దూసుకెళ్లుతున్నారు అదానీ. పట్టిందల్లా బంగారమైనట్లుగా అదానీకి ప్రతీ రంగంలోను విజయమే వరిస్తోంది.
ఒకప్పుడు టాటా బిర్లాలు. ఆ తర్వాత అంబానీలు..కానీ, ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ అదానీ అన్నట్లుగా ఉంది. ఒకప్పుడు ఇండియాలో వ్యాపారవేత్తలంటే టాటా బిర్లాలు. ఆ తర్వాత అంబానీలు. కానీ, ఇప్పుడు అందరి పేర్లు పక్కకి పోయి ఒక్క పేరు మాత్రమే వినిపిస్తోంది. అదే అదానీ. ఐదారేళ్లలోనే ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయారు గౌతమ్ అదానీ. పెట్టుబడులు పెట్టిన అన్ని వ్యాపారాల్లోనూ సక్సెస్ అయ్యి.. అపరు కుబేరుడిగా అవతరించాడు. ఒకప్పుడు విదేశీ ప్రముఖులు గుజరాత్కు వస్తే ముఖేశ్ అంబానీనే ప్రముఖంగా కనిపించే వారు. కానీ, ఇప్పుడంతా అదానీ మయమే. బ్రిటన్ ప్రధాని గుజరాత్ పర్యటనలో.. అక్కడ హడావుడంతా అదానీదే. బోరిస్ జాన్స్న్కు విందు ఇవ్వడమే కాదు.. బ్రిటన్తో కలిసి వ్యాపారం చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఆకాశంవైపు దూసుకుపోతున్న అదానీ..అంబానీ సైతం చిన్నబోయేలా ఆర్జన..19 నెలల్లోనే 14 లక్షల 82 వేల కోట్ల సంపద సృష్టి..భారత వ్యాపార సామ్రాజ్యంలో రాకీ భాయ్..100 కోట్లు సంపాదిస్తే గ్రేట్.. వెయ్యి కోట్లు సంపాదిస్తే గ్రేటెస్ట్.. కానీ, 15 లక్షల కోట్లు సంపాదిస్తే ఏమనాలి? అందులో 14 లక్షల 82వేల కోట్లను.. కేవలం 19 నెలల్లోనే సృష్టిస్తే ఎలా వర్ణించాలి? మానవ మాత్రులకు ఇలాంటి ఫీట్ సాధ్యమా అన్న డౌట్ రావొచ్చు. కానీ, కరెన్సీ నోటుపై ఉన్న గాంధీ బొమ్మపై ఒట్టేసి మరీ చెప్తున్నా.. ఇది అక్షరాలా నిజం. దేశంలో డబ్బున్నోళ్లకు బాప్ లాంటి ముఖేశ్ అంబానీకి 15 లక్షల కోట్లు సంపాదించడానికి 13ఏళ్లు టైమ్ పడితే.. గౌతమ్ అదానీకి మాత్రం నిండా రెండేళ్లు కూడా పట్టలేదు. సామాన్య జనం కలలో కూడా ఊహించలేనంత సంపదను జేబులో వేసుకుని.. భారత వ్యాపారవేత్తల్లో రాకీ భాయ్ అనిపించుకుంటున్నారు గౌతమ్ అదానీ.
వ్యాపారం అంటేనే వ్యూహాలు. వాటిని అమలు చేయడానికి కాస్తంత ధైర్యం. ఈ రెండూ కలిపి సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటే చాలు.. లక్ష్మీ దేవి వద్దన్నా వినకుండా నెత్తిపై కోట్లు కురిపిస్తుంది. ఇప్పుడు గౌతమ్ అదానీ సిచ్యుయేషన్ ఇదే. 13ఏళ్లు కష్టపడి ముఖేశ్ అంబాన్నీ మహా సామ్రాజ్యాన్ని నిర్మిస్తే.. 19 నెలల్లోనే అంబానీ దగ్గరకు వచ్చేశాడు అదానీ. అంబానీని దాటేయడానికి కేవలం 12శాతం సంపద దూరంలోనే ఉన్నాడు. అదానీకి ఏడు కంపెనీలుంటే.. వాటిలో ఐదు కంపెనీల విలువ లక్ష కోట్లకు పైనే ఉంది. ఇదంతా కేవలం 19 నెలల్లోనే సాధ్యమైంది. 2020 ఆగస్టు 3 నాటికి అదానీ ఎంటర్ప్రైజ్ విలువ 18 వేల 944 కోట్లు.. ఇప్పుడది 2 లక్షల 38 వేల 472 కోట్లకు చేరింది. అంటే 1159శాతం వృద్ధి సాధించింది. అదానీ గ్రీన్ విలువ 53 వేల 145 కోట్లయితే.. ఇప్పుడు 4 లక్షల 55 వేల 433 కోట్లు.. అంటే 757శాతం గ్రోత్. ఇక- అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ వాల్యూ 63 వేల 259 కోట్లు కాగా.. 174శాతం వృద్ధితో లక్షా 73 వేల 67 కోట్లకు పెరిగింది. అదానీ పవర్ 13 వేల 557 కోట్లు కాగా.. 561శాతం గ్రోత్తో 89 వేల 655 కోట్లకు చేరింది. 19 నెలల క్రితం అదానీ టోటల్ గ్యాస్ మార్కెట్ వాల్యూ 17 వేల 212 కోట్లు కాగా.. ఇప్పుడు 1414శాతం వృద్ధితో 2 లక్షల 60 వేల 589 కోట్లకు ఎగబాకింది. 25 వేల 235 కోట్ల విలువైన అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీ.. 1032శాతం వృద్ధితో 2 లక్షల 85వేల 736 కోట్లకు చేరింది. ఇక అదానీ విల్మర్ కంపెనీ 731శాతం వృద్ధితో 88 వేల 105 కోట్ల విలువైన కంపెనీగా ఎదిగింది. మరోవైపు ఇదే 19 నెలల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంపద కేవలం 32శాతం మాత్రమే పెరగడం విశేషం.
Also read : PK STrategy In congress : పాతాళంలోకి పడిపోతున్న కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న PK స్ట్రాటజీ అదేనా?
ఎవరూ ఊహించలేనంత సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలోకి చేరిపోయారు గౌతమ్ అదానీ. ప్రపంచ మార్కెట్లలో రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా పరిస్థితులు మారినప్పటికీ.. ఆయన తగ్గేదే లే అన్నట్లు ముందుకు సాగుతున్నారు. 2022 తొలి మూడు నెలల్లో ఆయన సంపద భారీగా పెరిగింది. 2021 ఆర్థిక సంవత్సరం మెుదటి త్రైమాసికంలో ప్రపంచంలో అందరికంటే అదానీ సంపద పెంచుకున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ను దాటి ఆయన సంపదలో పెరుగుదల నమోదైంది. అదానీ గ్రూప్కు చెందిన అదానీ ఎంటర్ప్రైజ్, అదానీ పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ విల్మర్ కంపెనీల షేర్ల విలువ 2022లో 103శాతం మేర పెరిగాయి. అధిక ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ వార్, పెరిగిన వడ్డీ రేట్లు లాంటి కారణాలతో స్టాక్ మార్కె్ట్లలోని చాలా కంపెనీల విలువలు తగ్గినప్పటికీ.. అదానీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రం పెరిగిపోయింది. అదానీ ఆస్తుల విలువ గణనీయంగా పెరగడంలో అదానీ విల్మర్ కంపెనీ పెద్ద పాత్ర పోషించింది. ఫిబ్రవరిలో మార్కెట్లోకి వచ్చిన ఈ షేర్ విలువ 100శాతం పెరగటంతో అందులో గౌతమ్ అదానీకి ఉన్న వాటాల విలువ కూడా భారీగానే పెరిగింది. ఆ తరువాత ఆయన ఆస్తిని పెంచేందుకు అదానీ పవర్, అదానీ ట్రాన్స్ మిషన్ కూడా ఉపయోగపడ్డాయి.
Also read : Naresh Patel : కాంగ్రెస్లో చేరనున్న పటీదార్ నేత నరేశ్ పటేల్..!
ఆరేళ్ల క్రితం అదానీ సంపద 24వేల కోట్లు.. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తల్లో ఆయన ఒకరు. కానీ, ఇప్పుడాయన ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. ఆరేళ్లలో ప్రపంచ సంపన్నుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదానీ అంటే ఒక బ్రాండ్. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులను సొంతం చేసుకుంది అదానీ గ్రూపే. తెలంగాణలోనూ అదానీ గ్రూప్ అనేక సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ నడుపుతోంది. వంట నూనెల నుంచి ఎయిర్పోర్టుల వరకు అనేక వ్యాపారాలు ఈ గ్రూప్ సొంతం. మరి.. కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసిన గౌతమ్ అదానీ భారత్లో సుమారు 16 లక్షల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు? అంటే అదే వ్యాపారవేత్తల లక్షణం..పక్కా వ్యాపారవేత్త ఎలా ఉండాలో..ఎలా ఆలోచించాలో అదానీని చూసి నేర్చుకోవాలంటారు స్టార్టప్ కంపెనీల యజమానులు.