Insurance schemes: ఆ రెండు పథకాల వార్షిక ప్రీమియం పెంచిన కేంద్రం.. వాటివల్ల ఉపయోగాలు ఏమిటంటే..
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు ఇన్సూరెన్స్ స్కీంల వార్షిక ప్రీమియంను పెంచింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)లను ప్రీమియాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Insurance schemes: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు ఇన్సూరెన్స్ స్కీంల వార్షిక ప్రీమియంను పెంచింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)లను ప్రీమియాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. PMJJBY యొక్క ప్రీమియం రేటు రోజుకు రూ. 1.25కి సవరించగా, ఇది సంవత్సరానికి రూ. 330 నుండి రూ. 436కి పెరిగింది. అదేవిధంగా PMSBY వార్షిక ప్రీమియం రూ.12 నుంచి రూ.20కి పెంచినట్లు అధికారిక ప్రకటన ద్వారా కేంద్రం తెలిపింది.
కొత్త ప్రీమియం రేట్లు 1 జూన్ 2022 (బుధవారం) నుండి అమలులోకి వచ్చాయి. శాతం పరంగా ప్రీమియం పెరుగుదల చూసుకుంటే PMJJBY విషయంలో 32 శాతం, PMSBYకి 67 శాతం పెరిగింది. అయితే 2015లో ఈ రెండు పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. చెల్లింపులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమచేస్తున్నారు. ఏడేళ్లపాటు ఏటా నష్టాలు వస్తున్నప్పటికీ ప్రీమియం పెంచలేదని ఆర్థిక శాఖ తెలిపింది. పథకాలు అమలు చేసిన తరువాత ప్రీమియం పెంపు ఇదే తొలిసారి. తాజాగా ప్రీమియం పెంపుతో పథకం అమలుకు ప్రైవేటు కంపెనీలనూ ఆహ్వానించడానికి వీలవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
ఈ రెండు పథకాలను ఆర్థికంగా లాభదాయకంగా మార్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 2022 మార్చి 31 నాటికి జీవనజ్యోతి యోజన కింద 6.4కోట్ల మంది, సురక్ష బీమా యోజన కింద 22 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. పథకం ప్రారంభం నుంచి సురక్ష బీమా కింద ప్రీమియం రూ.1,134 కోట్లు వసూలు చేయగా, క్లెయిమ్ ల రూపంలో రూ.2,513 కోట్లు చెల్లింపులు జరిగాయి. అదేవిధంగా జీవనజ్యోతి కింద రూ. 9,737 కోట్లు వసూలు చేసి రూ. 14,144 కోట్ల క్లెయిమ్ లు అందజేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ ద్వారా రూ.2,00,000 ఇన్స్యూరెన్స్ బెనిఫిట్ లభిస్తుంది. ప్రీమియం చెల్లించిన ఏడాది మాత్రమే ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. ప్రతీ ఏటా రెన్యూవల్ చేయడం తప్పనిసరి. ఈ స్కీమ్లో ఎవరైనా చేరొచ్చు. వయస్సు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. 55 ఏళ్ల వరకు బీమా వర్తిస్తుంది.
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ విషయానికి వస్తే ఇది యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ స్కీమ్. ఈ స్కీమ్లో ఉన్నవారు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే వారి నామినీకి రూ.2,00,000 ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటుంది ప్రభుత్వం. ఒకవేళ పాక్షికంగా వైకల్యానికి గురైతే రూ.1,00,000 ఆర్థిక సాయం అందిస్తుంది.