Bharat Jodo Yatra: రాజకీయ ప్రవేశం తరువాత తొలిసారి.. తండ్రి స్మారకాన్ని సందర్శించిన రాహుల్..
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు సాయంత్రం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీపెరంబుదూర్లోని తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని రాహుల్ గాంధీ సందర్శించారు.
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు సాయంత్రం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా మంగళవారం రాహుల్ గాంధీ తమిళనాడుకు చేరుకున్నారు. కాగా బుధవారం ఉదయం శ్రీపెరంబుదూర్లోని తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని సందర్శించారు. రాహుల్ రాజకీయ ప్రవేశం చేసిన తరువాత ఈ స్మారకం సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉదయం 7గంటల సమయంలో తండ్రి రాజీవ్ గాంధీ స్మారకం ను సందర్శించి రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అంతకుముందు ఈ స్మారకం ప్రాంగణంలో రాహుల్ మొక్కను నాటారు.
రాజీవ్ గాంధీ స్మారకం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాహుల్ గాంధీ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా రాహుల్ పలు కీలక వ్యాఖలు చేశారు. విద్వేష, విభజన రాజకీయాల కారణంగా నేను నా తండ్రిని కోల్పోయాను. ఇప్పుడు నా దేశాన్ని కూడా కోల్పోవాలనుకోవడం లేదంటూ రాహుల్ తన ట్విటర్ లో రాసుకొచ్చారు.
I lost my father to the politics of hate and division. I will not lose my beloved country to it too.
Love will conquer hate. Hope will defeat fear. Together, we will overcome. pic.twitter.com/ODTmwirBHR
— Rahul Gandhi (@RahulGandhi) September 7, 2022
ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది, ఆశ భయాన్ని ఓడిస్తుంది, మనమంతా ఐక్యంగా ఉంటే దేన్నైనా అధిగమించొచ్చు అంటూ రాహుల్ ట్విటర్ లో పేర్కొన్నారు. రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ ను సాయంత్రం 5గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తో సహాయ రాజస్థాన్, ఛత్తీస్గఢ్ సీఎంలు, కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గోనున్నారు.