TRS MLA Manchireddy kishan reddy : రెండోరోజు ఈడీ విచారణకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రెండో రోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు.
TRS MLA manchireddy kishan reddy ED interrogates : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రెండో రోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. మంగళవారం (సెప్టెంబర్ 27,2022) ఈడీ ఆఫీసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని అధికారులు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై ఆయన విదేశాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి పలు ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన క్యాసినో కేసులో టీఆర్ఎస్ నేత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ కేసులో చీకోటి ప్రవీణ్పై ఇప్పటికే కేసు నమోదు చేసి విచారించారు. గతంలో మంచిరెడ్డి విదేశాలకు వెళ్లి క్యాసినో ఆడినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఫెమా నిబంధనలు అతిక్రమించి మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఈడీకి సమాచారం అందింది. దీనిపై ఇప్పటికే ఆయనకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే మంచిరెడ్డి కిషన్రెడ్డిని తమ కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించటంతో పాటు వరుసగా రెండో రోజు కూడా విచారణ కొనసాగిస్తున్నారు ఈడీ అధికారులు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు రాజకీయ నేతలకు ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు ఈడీ గుర్తించింది. వారందరికీ నోటీసులు జారీచేసింది. వీరిలో మంచిరెడ్డి కిషన్రెడ్డి కూడా ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు.
మంచిరెడ్డి ఏయే దేశాలకు వెళ్లి క్యాసినో ఆడారు?.. డబ్బు తరలింపు ఎలా జరిగింది? అన్న కోణాల్లో ఈడీ అధికారులు ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని అధికారులు రికార్డు చేస్తున్నారు. క్యాసినోలో భాగంగా హవాలా మార్గంలో నగదు బదిలీ చేసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి మనీ ల్యాండరింగ్కు పాల్పడినట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ఈడీ వరుసగా టార్గెట్ చేయడం రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది.