Air India : ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్..
ఎయిరిండియా విమానంలో మద్యం మత్తులో మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో నిందితుడిగాఉన్న శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం ఢిల్లీకి అతన్ని తరలించారు. ఈరోజు అతన్ని పటియాలా కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.
Air India : ఎయిరిండియా విమానంలో మద్యం మత్తులో మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో నిందితుడిగాఉన్న శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం ఢిల్లీకి అతన్ని తరలించారు. ఈరోజు అతన్ని పటియాలా కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. గతేడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న క్రమంలో శంకర్ మిశ్రా అదే విమానంలో ప్రయాణిస్తున్న 70ఏళ్ల వృద్ధురాలిపై మద్యం మత్తులో మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
వృద్ధురాలు తనకు ఎదురైన అవమానంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, విమానంలో తనకు జరిగిన ఘటనపై ఎయిరిండియా సిబ్బందికి తెలుపగా సరిగా స్పందించలేదని, తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎయిరిండియా చైర్మన్ చంద్రశేఖరన్కు ఫిర్యాదుసైతం చేశారు. ఈ ఘటనతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అయితే, శంకర్ మిశ్రా ఆచూకీని కనుగొనేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అతను విదేశాలకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఘటన జరిగిన నాటి నుంచి శంకర్ మిశ్రా తన ఫోన్ను స్విచ్ఛాఫ్ చేశాడు. అయితే, సోషల్ మీడియా ఖాతాల ద్వారా తన స్నేహితులకు టచ్లో ఉంటున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అతనిపై నిఘా ఉంచి బెంగళూరులో శుక్రవారం అర్థరాత్రిదాటిన తరువాత అరెస్టు చేశారు.
34ఏళ్ల మిశ్రా అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వెల్స్ ఫార్గోలో పనిచేస్తున్నాడు. విమాన ఘటన తరువాత మిశ్రాను కంపెనీ విధుల నుంచి తొలగించింది. ఈ సందర్భంగా వెల్స్ఫార్గో కంపెనీ యాజమాని మాట్లాడుతూ.. వెల్స్ పార్గో ఉద్యోగులను వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రవర్తన మొక్క అత్యున్నత ప్రమాణాలను కలిగి ఉందని అన్నారు. కానీ, మిశ్రాపై ఇలాంటి ఆరోపణలు రావడం తమను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. శంకర్ మిశ్రా వెల్స్ ఫార్గో భారత విభాగానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. తాజా ఘటనతో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు.