Tirumala: తిరుమలలో డ్రోన్ దృశ్యాలపై స్పందించిన టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి.. ఏమన్నారంటే?
తిరుమల తిరుపతి దేవస్థానం పైనుండి డ్రోన్ తో చిత్రీకరించినట్లుగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నో ఫ్లై జోన్గా ఉన్న తిరుమలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. పటిష్ట భద్రత ఉన్న ఆలయంపై డ్రోన్తో చిత్రీకరించేందుకు అవకాశం లేదని తెలిపారు. అయితే..
Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో డ్రోన్ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆగమశాస్త్రం ప్రకారం.. శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి వీలులేదనే నిబంధన ఉంది. అయినా, డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించినట్లుగాఉన్న దృశ్యాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
అలిపిరి మొదలుకుని శ్రీవారి ఆలయం, తిరుమలలోని ఇతర పరిసరాలన్నీ కూడా హై సెక్యూరిటీ జోన్లో ఉంటాయి. ఎక్కడికక్కడ సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. సెక్యూరిటీగా 24 గంటలూ ఉంటుంది. ఇంత సెక్యూరిటీ ఉన్నా.. ఒక డ్రోన్ కెమెరా సాక్ష్యాత్తు శ్రీవారి ఆలయం ఎదురుగా ఏదైతే ఆస్తాన మండపం ఉందో ఆ ప్రాంతం నుండి డ్రోన్ కెమెరాతో మొత్తం షూట్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాల్లో ఉంది. దీంతో శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. పటిష్ట భద్రత ఉన్న ఆలయంపై డ్రోన్తో చిత్రీకరించేందుకు అవకాశం లేదని తెలిపారు. అయితే, డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఇన్స్టాగ్రామ్ రీల్ హైదరాబాద్కు చెందిన సంస్థ సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేసినట్లుగా గుర్తించామని, సదరు సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అన్నారు. నిజంగా అవి డ్రోన్ చిత్రాలా? పాత చిత్రాలతో యానిమేట్ చేశారా? అనే కోణంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. తిరుమలలో పటిష్ఠ భద్రత ఉందని, డ్రోన్ చిత్రాలపై ఆందోళన పడాల్సిన పనిలేదని సుబ్బారెడ్డి భక్తులకు విజ్ఞప్తి చేశారు.