హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు రావొచ్చు..!

  • Published By: srihari ,Published On : May 14, 2020 / 01:23 AM IST
హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు రావొచ్చు..!

లాక్‌డౌన్ కారణంగా సొంత ఊళ్లకు వెళ్లలేక హైదరాబాద్ నగరంలోనే నెలల తరబడి ఉంటున్న ఏపీకి చెందినవారి కోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది. ఏపీకి తిరిగి వచ్చేవారికోసం ఆర్టీసీ ప్రత్యేకించి ఆర్టీసీ సర్వీసులు నడపనుంది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్లో అప్లయ్ చేసుకున్నవారికే అనుమతి ఉంటుంది. సొంతూళ్లకు వెళ్లిన తర్వాత ఆయా జిల్లాలో క్వారంటైన్ కేంద్రంలో ఉండేందుకు అంగీకరించిన వారికే బస్సు టిక్కెట్లను జారీ చేస్తారు. దీనికి తగిన ఏర్పాట్లు చేయాలంటూ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల ఆర్టీసీ రీజినల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. 

ఏపీకి వస్తామంటూ హైదరాబాద్ నుంచి 8 వేల మంది, రంగారెడ్డి జిల్లా పరిధిలో 5 వేల మంది స్పందన పోర్టల్లో అప్లయ్ చేసుకున్నారు. మొత్తం 13 వేల మందిని తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం బస్సు సర్వీసులు నడపనుంది. ఏసీ బస్సుల్లో గరుడ ఛార్జీ, నాన్ ఏసీ బస్సుల్లో సూపర్ లగ్జరీ ఛార్జీ తీసుకోనున్నారు. ఈ బస్సులు మియాపూర్-బొల్లారం క్రాస్రోడ్, కూకట్ పల్లి, హౌసింగ్ బోర్డ్, ఎల్బీనగర్లలో ప్రయాణికులను ఎక్కించుకుంటారు. అక్కడి నుంచి మధ్యలో ఎక్కడా ఆపరు. ఆర్టీసీ బస్సులు నేరుగా గమ్యస్థానానికి చేరుకుంటాయి. ముందుగా ఆన్‌లైన్  బుకింగ్‌కు అవకాశం ఇస్తారు. ఈ సర్వీసుల్లో కరెంట్ బుకింగ్ అవకాశం లేదు. 

బస్సు సర్వీసులను రెండు, మూడు రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం దీనిపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. అప్పుడే ఆర్టీసీ అధికారులు ఈ-టికెట్ బుకింగ్ అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. రెండో దశలో బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉండిపోయిన ఏపీకి చెందిన వారినీ తీసుకొచ్చేందుకు కూడా బస్సు సర్వీసులు నడపే అవకాశం ఉంది. బెంగళూరులో 2,700 మంది, చెన్నైలో 1,700 మంది స్పందన పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఏపీ నుంచి వెళ్లే వారికి ఈ సర్వీసుల్లో అవకాశం ఉండదని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. 

అత్యవసర, ముఖ్యమైన పనులపై ప్రయాణించే వారికి పోలీసుశాఖ కొవిడ్-19 పేరుతో ఈ-పాస్‌‌లు జారీ చేయనుంది. అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో సూచించింది. కొవిడ్-19 అత్యవసర ఈ-పాస్‌కు దరఖాస్తు చేసుకునే చిరునామా, ఈ-పాస్ కోసం ఇచ్చిన వివరాలను ఆమోదిస్తే.. వాహన అత్యవసర ఈ-పాస్‌ను దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్, మెయిల్ ఐడీకి పంపిస్తారు.

Read Here:

సీఎం జగన్ సమీక్ష : ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

వారి కోసం విమానాలు వెయ్యండి.. కేంద్రమంత్రికి జగన్ లేఖ