వారి కోసం విమానాలు వెయ్యండి.. కేంద్రమంత్రికి జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్మికులు కూవైట్లో చిక్కుకున్నారని, వారిని స్వదేశానికి రప్పించేందుకు విమాన ఏర్పాట్లను చేయాలని కోరుతూ విదేశాంగ మంత్రి జైశంకర్కు ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాలకు నేరుగా విమానాలను ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు ముఖ్యమంత్రి జగన్.
విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ను కొనియాడిన జగన్.. సొంత ఖర్చులతో వేలాది మంది భారతీయులు వెనక్కి వస్తున్నారని వెల్లడించారు. అయితే గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోల్పోయి అక్కడే చిక్కుకుపోయిన వేలాది మంది వలస కార్మికులు మాత్రం కష్టాలు పడుతున్నారని జగన్ చెప్పారు.
స్వదేశానికి రావడానికి ప్రయాణ ఖర్చును భరించే స్థితిలో వారు లేరని, ఇమ్మిగ్రేషన్ ఫీజును మాఫీ చేసి, వారందరికి మన దేశ రాయబార కార్యాలయం ఎగ్జిట్ క్లియరెన్స్ ఇచ్చిందని జగన్ చెప్పారు. వారి ప్రయాణ ఖర్చును భరించేందుకు కువైట్ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని అన్నారు.
వెంటనే కువైట్లో ఉన్న హైకమిషనర్కు సూచనలు చేసి ఏపీకి విమానాలు ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు. తిరిగి వచ్చే వలస కూలీలకు అవసరమైన వైద్య పరీక్షలను నిర్వహించి, వారిని క్వారంటైన్కు పంపించడానికి అన్ని సదుపాయాలను సిద్ధంగా ఉంచుకున్నట్లు జగన్ చెప్పారు.