Shreyas Iyer : టీమ్ఇండియా టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..! వైభవ్ సూర్యవంశీకి చోటు!
టీమ్ఇండియా టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నియమితులు కావడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది.
Shreyas Iyer to replace Suryakumar Yadav as India T20I captain report
- భారత టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్
- శనివారం అధికారిక ప్రకటన
Shreyas Iyer : టీమ్ఇండియా టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ నియమితులు కావడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. శనివారం ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం. గురువారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడు సూర్యకుమార్ యాదవ్ స్థానంలో బాధ్యతలను చేపట్టనున్నాడు.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం శనివారం సెలక్టర్లు జట్లను ఎంపిక చేయనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలని ఇప్పటికే శ్రేయస్ అయ్యర్కు సమాచారం అందినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు సదరు కథనాల సారాంశం. ఇక అదే సమయంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మను వైస్ కెప్టెన్గా నియమించనున్నారట.
శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే.. అతడు భారత్ తరుపున చివరిసారిగా డిసెంబర్ 23న అంతర్జాతీయ టీ20 క్రికెట్ మ్యాచ్ ఆడాడు. ఆ తరువాత మరో సారి భారత్ తరుపున టీ20 మ్యాచ్ ఆడలేదు. మిడిల్ ఆర్డర్లో సూర్య. తిలక్ వర్మలు నిలకడగా రాణించడంతో అతడికి స్థానం దక్కలేదు.
అద్భుత రికార్డు..
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ రికార్డు అద్భుతంగా ఉంది. ఐపీఎల్లో కేకేఆర్కు 2024లో టైటిల్ను అందించాడు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్, 2025లో పంజాబ్ కింగ్స్ను ఐపీఎల్లో ఫైనల్స్కు చేర్చాడు. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గానూ అదరగొట్టాడు. ఐపీఎల్ 2025లో 175.07 స్ట్రైక్రేటుతో 604 పరుగులు చేయగా.. ఐపీఎల్ 2026లో 168.81 స్ట్రైక్రేటుతో 498 పరుగులు సాధించాడు.
35 ఏళ్ల సూర్యకుమార్ను గత కొంతకాలంగా పేలవ ఫామ్తో సతమతమవుతున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్లో అతను తొమ్మిది ఇన్నింగ్స్లలో 136.72 స్ట్రైక్ రేట్తో 242 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఐపీఎల్ 2026లో 13 ఇన్నింగ్స్లలో 20.76 సగటు, 147.54 స్ట్రైక్ రేట్తో కేవలం 270 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడికి తుది జట్టులో కూడా చోటు కష్టమే.
చరిత్ర సృష్టించనున్న వైభవ్ సూర్యవంశీ..
ఇదిలా ఉండగా.. 15 ఏళ్ల సూర్యవంశీ టీమ్ఇండియా టీ20 జట్టుకు ఎంపిక లాంఛనమే అని తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ 237.30 స్ట్రైక్ రేట్తో 776 పరుగులు చేసి భీకర ఫామ్లో ఉన్నాడు. అతడు టీమ్ఇండియాకు ఎంపిక అయితే చరిత్ర సృష్టిస్తాడు. అతి తక్కువ ఏజ్లో భారత జట్టుకు ఎంపిక అయిన ప్లేయర్గా రికార్డుకు ఎక్కనున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 16 ఏళ్ల 205 రోజుల సమయంలో భారత జట్టు తరుపున అరంగ్రేటం చేశాడు.
