సీఎం జగన్ సమీక్ష : ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

  • Published By: madhu ,Published On : May 13, 2020 / 11:17 AM IST
సీఎం జగన్ సమీక్ష : ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

ఏపీ రాష్ట్రంలో కోవిడ్‌ –19 పరీక్షలు కొనసాగుతున్నాయి. 2020, మే 13వ తేదీ బుధవారం వరకు 2,01,196 పరీక్షలు చేసింది వైద్య ఆరోగ్య శాఖ. మే 12వ తేదీ మంగళవారం ఒక్క రోజే 9,284 పరీక్షలు నిర్వహించారు. ప్రతి మిలియన్‌కు 3,768 పరీక్షలు
చేశారు. వైరస్ సోకి చికిత్స పొంది..రికవరీ అయిన వారి సంఖ్య 1142కు చేరుకుంది. యాక్టివ్‌ కేసులు 948 ఉండగా..గడిచిన 24 గంటల్లో 86 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన 48 కేసుల్లో 36 పాత క్లస్టర్ల నుంచే వచ్చాయి. కొత్త పాజిటివ్‌ కేసుల కంటే డిశ్చార్జీల సంఖ్య పెరుగుతోంది.

సీఎం జగన్ సమీక్ష
2020, మే 13వ తేదీ బుధవారం కోవిడ్ 19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. 

పాజిటివ్ కేసులు 1.06 శాతం
రాష్ట్రంలో పాజిటివిటీ కేసులు 1.06 శాతం, దేశంలో 4.01 శాతం, రాష్ట్రంలో మరణాల రేటు 2.20 శాతం, దేశంలో 3.25 శాతం
రికవరీ రేటు రాష్ట్రంలో 53.44 శాతం, దేశంలో 32.90 శాతంగా ఉందని తేల్చారు. ఏ లోటూ లేకుండా ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నామని అధికారులు వివరించారు. 

ఆరోగ్య ఆసరా పథకం
ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలని, ప్రస్తుత ప్రభుత్వంలో కొత్తగా పెట్టిన కార్యక్రమమని, అమల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలన్నింటినీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించామని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రతి మూడు వారాలకు బిల్లులు అప్‌లోడ్‌ కావాలని, ఆ తర్వాత వాటిని వెంటనే మంజూరు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

కొత్తగా 108 సర్వీసు వాహనాలు 
108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1060 వాహనాలను జూలై 01న ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే టెలి మెడిసిన్‌ కోసం కొత్త బైకులను కూడా కొనుగోలు చేయాలని ఆదేశించారాయన. 

చేపలు, రోయ్యల అమ్మకాలు
చేపలు, రొయ్యల అమ్మకాలు రాష్ట్రంలో స్థానికంగా విక్రయించేలా, దీని కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. కనీసం 30 శాతం స్థానిక వినియోగం ఉండేలా చూడాలన్నారు. దీనిపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. 
అలాగే రైతులు పండించిన ఇతర ఉత్పత్తులు కూడా కనీసం 30 శాతం స్థానికంగా వినియోగం ఉండేలా చూడాలన్నారు. 

గోదాముల నిర్మాణంపై దృష్టి
చేపలకు ధర, మార్కెటింగ్‌ విషయాల్లో చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవికి సూచించారు. ట్రేడర్లతో మాట్లాడాలని, అలాగే ట్రేడర్లకు అవసరమైన మార్కెటింగ్‌ ఇతర రాష్ట్రాల్లో లభించేలా తగిన చర్యలు తీసుకునేలా చూడాలని సీఎస్ ను ఆదేశించారు. 
రాయలసీమ తదితర జిల్లాలలో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న పండ్లు, టమోటాలకు మరింత మార్కెట్‌ చేయాలని, కోల్డ్‌ స్టోరేజీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, గోదాముల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. 

అండగా ఉంటున్నాం
గర్భిణీలు, కీమోథెరఫీ, డయాలసిస్‌ వంటి ఎమర్జెన్సీ సేవలు అవసరమైన వారందర్నీ గుర్తించామని అధికారులు తెలిపారు. 
షెడ్యూలు ప్రకారం వారికి వైద్య సేవలు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. షెడ్యూలు సమయానికి వైద్య సిబ్బందే కాల్‌ చేసి వైద్య సేవల కోసం వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది అన్ని రకాలుగా వారికి అండగా ఉంటున్నామన్నారు. 

Read Here>> ఏపీలో కరోనా @ 2137 : కొత్త కేసులు 48