JLL Report: కోటి రూపాయలకు మించి ధర ఉన్న ఇళ్లకు భారీ డిమాండ్.. హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..
హైదరాబాద్తో పాటు దేశంలోని 7 ప్రధాన నగరాల్లో లగ్జరీ ఇళ్లను కొనేందుకు కొనుగోలుదారులు మొగ్గుచూపుతున్నారు. సుమారు కోటి రూపాయల ధరల శ్రేణి ఇళ్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు.
![JLL Report: కోటి రూపాయలకు మించి ధర ఉన్న ఇళ్లకు భారీ డిమాండ్.. హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే.. JLL Report: కోటి రూపాయలకు మించి ధర ఉన్న ఇళ్లకు భారీ డిమాండ్.. హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..](https://10tv.in/wp-content/uploads/2023/07/housing-unit-sales.jpg)
housing unit sales reaching 15 year high in India
JLL Report Highlights: భారత్లో నిర్మాణ రంగం క్రమంగా పుంజుకుంటోంది. అందుకు అనుగుణంగానే ఇళ్ల అమ్మకాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ క్యాలెండర్ ఇయర్ తొలి అర్ధభాగంలో గత ఏడాదితో పోలిస్తే ఇళ్ల అమ్మకాలు దేశంలో 21శాతం పెరిగాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ ప్రకటించింది. ఇక మన హైదరాబాద్ విషయానికి వస్తే గత ఏడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే ఈ క్యాలెండర్ ఇయర్ మొదటి ఆరునెలల్లో ఇళ్ల అమ్మకాలు 24 శాతం మేర పెరిగాయి. అంటే జనవరి నుంచి జూన్ వరకు 14 వేల 460 గృహాలు అమ్ముడయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇళ్ల కొనుగోలు రేంజ్లో స్పష్టమైన మార్పు వచ్చిందని జేఎల్ఎల్ నివేదిక చెబుతోంది. మూడేళ్ల క్రితం వరకు అపర్డబుల్ హౌజెస్, మిడ్ సైజ్ రేంజ్ ఇళ్లకు డిమాండ్ ఉండగా ఇప్పుడు క్రమంగా ఆ ట్రెండ్ మారుతోంది.
హైదరాబాద్తో పాటు దేశంలోని 7 ప్రధాన నగరాల్లో లగ్జరీ ఇళ్లను కొనేందుకు కొనుగోలుదారులు మొగ్గుచూపుతున్నారు. సుమారు కోటి రూపాయల ధరల శ్రేణి ఇళ్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, పూణెలో కోటి రూపాయలు మించి ధర ఉన్నఇళ్ల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 50 శాతం వరకు పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి. 2022 జనవరి- జూన్ మధ్య ఈ తరహా ఇళ్ల అమ్మకాల సంఖ్య 33 వేల 477 కాగా, ఈ ఏడాది జనవరి- జూన్లో 50 వేల 132 యూనిట్లకు పెరిగింది. ఇక దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ క్యాలెండర్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో 21 శాతం పెరిగి లక్షా 26 వేల 587 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఇక మన హైదరాబాద్లోనూ కోటి రూపాయల ప్రైస్ రేంజ్లోనే ఇళ్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. మరోవైపు 50 లక్షల ధరలోపు ఉన్న ఫ్లాట్ల అమ్మకాలు గత యేడాదితో పోలిస్తే 2 శాతం తగ్గాయి. 50 లక్షల నుంచి 75 లక్షల రూపాయల విభాగంలో అమ్మకాలు 4 శాతం పెరగడంతో సుమారు 2 వేల వంద ఇళ్లు అమ్ముడుపోయాయి. ఇక 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు విలువ కలిగిన ఇళ్ల అమ్మకాలు 25 శాతం వృద్ధితో 2 వేల 300 గృహాలు సేల్ అయ్యాయి. కోటి నుంచి కోటిన్నర రూపాయల ప్రైస్ రేంజ్లో ఇళ్ల అమ్మకాలు గత యేడాది ఇదే సమయంతో పోల్చినప్పుడు 67 శాతం పెరిగ్గా ఈ జనవరి నుంచి జూన్ వరకు సుమారు 6 వేల ఇళ్లు అమ్ముడయ్యాయి.
Also Read: సైలెంట్లో ఉన్న ఫోన్ కనిపించకపోతే ఏం చేయాలి?
ఇక కోటిన్నర రూపాయలకు పైగా ధర కలిగిన ఇళ్ల అమ్మకాల్లోనూ 21 శాతం వృద్ది నమోదైందని జేఎల్ఎల్ తమ తాజా నివేదికలో వెల్లడించింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్లోని పశ్చిమ ప్రాంతంలోని ఐటీ కారిడార్ పరిసరాల్లో కోటి నుంచి కోటిన్నర రూపాయల ప్రైస్ రేంజ్లోని ఇళ్లకి భారీ డిమాండ్ ఉంటోంది. నానక్ రాంగూడ, నార్సింగి, పుప్పాలగూడ, గచ్చిబౌలి, కోకాపేట్, గండిపేట్, కొండాపూర్, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో కోటి నుంచి రెండు కోట్ల మధ్య ధరలున్న ఇళ్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి.