Telangana: కేసీఆర్, హరీశ్‌, కేటీఆర్ లక్ష్యంగా.. బీజేపీ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే లక్ష్యంతో కమలనాథులు వేసిన మాస్టర్ ప్లాన్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది.

Telangana: కేసీఆర్, హరీశ్‌, కేటీఆర్ లక్ష్యంగా.. బీజేపీ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

telangana assembly elections 2023 bjp plan to put bandi sanjay on ktr

Telangana Assembly Elections 2023: సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ టార్గెట్గా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భారీ స్కెచ్ వేస్తున్నాయి. ఆ రెండు పార్టీలకూ కొరకరాని కొయ్యలా తయారైన గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లతో పాటు కామారెడ్డి నియోజకవర్గాల్లో ముగ్గురు ముఖ్యనేతలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. రాష్ట్రం మొత్తం గెలిస్తే ఒక లెక్కా.. ఈ నాలుగు మరో లెక్కా అనేలా కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే లక్ష్యంతో కమలనాథులు వేసిన మాస్టర్ ప్లాన్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది.

అధికార బీఆర్ఎస్ లో స్టార్ అండ్ స్ట్రాంగ్ లీడర్స్ ముగ్గురే ముగ్గురు. ఓటమెరుగని ఈ నేతలపై పోటీ చేయడం అంటేనే విపక్ష పార్టీలకు సవాల్.. డిపాజిట్ దక్కించుకోవడమే పెద్ద టాస్క్. వాళ్లే సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు.. మరోసారి ఈ ముగ్గురి గెలుపుపై ఎవరికీ ఎటువంటి అనుమానం లేదు. వారిలో ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుందనేదే ఎప్పుడూ తెలంగాణావ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగే చర్చ. సీఎం కేసీఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన 1983లో తప్ప.. ఎప్పుడూ ఓటమి అన్నది ఎరుగకుండా విజయ దుందుబి మోగిస్తున్నారు. 1985 నుంచి అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభ.. ఎన్నిక ఏదైనా గెలుపు కేసీఆర్ సొంతం అవుతూ వస్తోంది. ఆయన ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో తప్ప మరెప్పుడూ ఓటమన్నదే ఎదురు కాలేదు.

KCR, Eatala Rajender

KCR, Eatala Rajender

తన సొంత నియోజకవర్గం సిద్ధిపేట నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సీఎం కేసీఆర్.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గజ్వేల్ నియోజకవర్గానికి మారారు. గత రెండు ఎన్నికల్లోనూ సీఎం గజ్వేల్ నుంచే గెలిచారు. గత ఎన్నికల్లో 58 వేల మెజార్టీతో గెలిచిన సీఎం.. ముచ్చటగా మూడోసారి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు తొలిసారిగా కామారెడ్డి బరిలోకి దిగబోతున్నారు. ఐతే సీఎం కేసీఆర్ను నిలువరించడమే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపే అన్వేషణలో పడ్డాయి కాంగ్రెస్, బీజేపీలు. ఈ సారి రెండు చోట్ల అసెంబ్లీకి పోటీచేస్తున్న సీఎం కేసీఆర్ పై పశ్చిమ బెంగాల్ ఫార్ములా ప్రయోగించాలని బీజేపీ స్కెచ్ వేస్తోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీపై సుదేంధు అధికారిని పోటీకి పెట్టిన బీజేపీ.. మమతకు షాక్ ఇచ్చింది. ఇక్కడ అదే ఫార్ములా ప్రకారం గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై బీజేపీ ముఖ్యనేత ఈటలను, కామారెడ్డిలో మరో నేత విజయశాంతిని పోటీకి పెడితే ఎలా ఉంటుందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఈటల సైతం దీనిపై హుజూరాబాద్ లో క్లారిటీ ఇఛ్చేశారు. హుజూరాబాద్ తో పాటు గజ్వేలులోనూ పోటీ చేయబోతున్నట్లు సంకేతాలిచ్చేశారు.

ఇక కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని మరోసారి బరిలో దింపేందుకు సిద్ధం అవుతోంది. ఇక సీఎం కేసీఆర్ పోటీ చేసే రెండో నియోజకవర్గం కామారెడ్డిలో కాంగ్రెస్ కు మైనార్టీ లీడర్ షబ్బీర్ అలీ రూపంలో బిగ్ హ్యాండ్ ఉండనే ఉంది. దీంతో సీఎం కేసీఆర్ కు గజ్వేల్లో బీజేపీ నుంచి.. కామారెడ్డిలో కాంగ్రెస్నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశీలకులు. ప్రత్యర్థుల ప్లాన్స్ అలా ఉంటే ఈసారి గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీకన్నా సీఎం కేసీఆర్ కు ఎక్కువ మెజార్టీ వస్తుందంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు.

Bandi Sanjay, KTR

Bandi Sanjay, KTR

ఇక ప్రతిపక్షాలకు చాలెంజ్ విసురుతున్న నియోజకవర్గాల్లో సిరిసిల్ల ఒకటి.. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ కంచుకోటగా స్థిరపడిపోయింది. కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 2009లో తొలిసారిగా పోటీచేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో హోరాహోరీగా జరిగిన పోటీలో కేటీఆర్ కేవలం 171 ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. కానీ ఆ తర్వాత ఇక కేటీఆర్కు తిరుగు లేకుండా పోయింది. తన పనితీరుతోనే తానేంటో నిరూపించుకున్న కేటీఆర్.. ఏడాది తిరక్కుండానే 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఏకంగా 68 వేల పైచిలుకు మెజార్టీతో రెండోసారి గెలుపొందారు. ఇక 2014లో తెలంగాణా ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో 53 వేల మెజార్టీ.. 2018లో ఏకంగా 89 వేల మెజార్టీతో వరుసగా గెలుపొందారు. ఇక ఈ ఎన్నికల్లోనూ సిరిసిల్ల నుంచే పోటీచేస్తున్న కేటీఆర్.. లక్ష ఓట్ల మెజార్టీ టార్గెట్గా ప్రణాళికలు రచిస్తున్నారు. కేటీఆర్కు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డి మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. ఇక ఇక్కడ కూడా బీజేపీ బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. అవసరమైతే బిజేపీ ఎంపీ బండి సంజయ్ నే బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే చర్చ కూడా పార్టీలో జోరుగా సాగుతోంది.

Also Read: కాంగ్రెస్‌కు ఎన్‌ఆర్‌ఐ కష్టం.. ఝాన్సీరెడ్డికి ఆదిలోనే అడ్డంకులు

గజ్వేల్, సిరిసిల్ల ఒక ఎత్తైతే.. ఆ రెండింటికీ మించి విపక్షాలకు కొరకరాని కొయ్యిగా మారిన మరో నియోజకవర్గం సిద్దిపేట.. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన సిద్దిపేట నుంచి మంత్రి హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిన్నవయసులోనే డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించిన హరీశ్రావు. గత ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు. 2004లో తొలిసారి పోటీ చేసినప్పుడు 24 వేల ఆధిక్యంతో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన హరీశ్ రావు.. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతిసారి తన మెజార్టీని తానే అధిగమిస్తూ.. విపక్షాల డిపాజిట్లను గల్లంతు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Also Read: పదవుల కోసం కాదు అవమానాలు భరించలేకే రాజీనామా చేశా : పొన్నాల లక్ష్మయ్య

గత ఎన్నికల్లో ఏకంగా లక్ష 18 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం హరీశ్ కు సాధ్యమైంది. ఈ రికార్డును ఇప్పట్లో మరొకరు అధిగమించడం కూడా సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. ఈ నియోజకవర్గంలో హరీశ్రావును ఓడించడం కన్నా.. ఆయన మెజార్టీని తగ్గించడం ఎలా అన్నదే ప్రత్యర్థి పార్టీలకు పెద్ద సమస్యగా మారింది. హరీశ్పై దీటైన అభ్యర్థిని నిలిపి మెజార్టీని లక్ష దాటకుండా చూసుకోవడమే విపక్షాలకు సవాల్ గా మారుతోంది. ఇందుకోసం బిజేపీ సరికొత్త ప్లాన్ ను రెడీ చేస్తోంది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును సిద్దిపేట బరిలో దింపడంపై చర్చ చేస్తోంది. రఘునందన్ రావు సైతం సిద్దిపేటలో అయినా.. గజ్వేల్ లో అయినా పోటీకి సై అంటూ ఎప్పటినుండో సంకేతాలిస్తూ వస్తున్నారు.

Also Read: బెంగళూరులో ఐటీ దాడుల్లో దొరికిన రూ.42 కోట్లు కాంగ్రెస్ నేతవే: మంత్రి హరీష్ రావు

ఈ మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరన్నది కాంగ్రెస్, బీజేపీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోయినా.. బీఆర్ఎస్లో టాప్ లీడర్లు ముగ్గురినీ ఆయా నియోజకవర్గాలకే పరిమితం చేయగలిగేలా గట్టిపోటీ ఇచ్చే నేతల కోసం జల్లెడ పడుతున్నాయి రెండు పార్టీలు. ఇందులో భాగంగానే బిజేపీ నయా ప్లాన్ తెరపైకి తెస్తోంది. కేసీఆర్ పై కామారెడ్డిలో విజయశాంతి, గజ్వేలులో ఈటల రాజేందర్, సిద్దిపేటలో హరీష్ పై రఘునందన్ రావు, సిరిసిల్లలో కేటీఆర్ పై బండి సంజయ్ బరిలో దింపాలనే వ్యూహం ప్రస్తుతం ప్రాథమిక చర్చల్లోనే ఉంది. అయితే ఇది సఫలం అయితే మాత్రం ఈ నాలుగు నియోజకరవ్గాల్లో పోరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం మాత్రం ఖాయం. మరోవైపు ఈ ముగ్గురు నేతలు మాత్రం ఒకరి రికార్డును ఇంకొకరు అధిగమించడమే టార్గెట్ గా పోటీపడుతున్నారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరి రికార్డును ఎవరు బద్ధలు కొడతారో.. ఈ ముగ్గురిని కాంగ్రెస్, బీజేపీ లు ఎంతవరకు నిలువరిస్తాయో చూడాల్సిందే.