Rajasthan : పేదలకు అందుబాటులో IVF.. మ్యానిఫెస్టోలో పెట్టిన ఆ పార్టీ
అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో నిరుపేదల కోసం IVF ను చేర్చింది. ఆ పార్టీ అధికారంలోకి వస్తే వంధ్యత్వంతో బాధపడుతున్న జంటలకు IFV చికిత్స వరం కానుంది. ఇంతకీ ఏ పార్టీ.. ఎక్కడ.. చదవండి.
Rajasthan : అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజస్ధాన్లో ఇటీవల కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టో విడుదల చేసింది. సీఎం అశోక్ గెహ్లాట్ విడుదల చేసిన మేనిఫెస్టోలో చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ క్రింద IVF ను చేర్చింది. వంధ్యత్వంతో పోరాడుతున్న జంటల కలలను నెరవేర్చడంలో నిజంగా ఇది సహాయపడుతుంది.
రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ మంగళవారం విడుదల చేసిన మేనిఫెస్టోలో చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ క్రింద ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ను చేర్చనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం క్రింద రూ. 25 లక్షల నుండి రూ.50 లక్షల వరకు కేటాయిస్తారు. IVF అనేది ఆర్ధికంగా బలంగా ఉన్న జంటలకు పరిమితంగా ఉంది. IVF కోసం బీమా కవర్ అమలు చేస్తే సంతానోత్పత్తి చికిత్స దానికి సంబంధించిన ఖర్చులను భరించలేని నిరుపేద జంటలకు అందుబాటులో ఉంటుంది. రాజస్థాన్లో IVF చికిత్స కు ఒక్కో సైకిల్ కి రూ.90,000 నుండి రూ.2 లక్షల వరకు ఖర్చు ఉంటుంది. కొందరి విషయంలో ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
ఈ విషయంపై జైపూర్లోని బిర్లా ఫెర్టిలిటీ మరియు IVF సలహాదారు డాక్టర్ ప్రియాంక యాదవ్ స్పందించారు. 10 శాతం మంది జంటలు ఖర్చులను భరించలేక IVF విధానాన్ని విడిచిపెడుతున్నారని అన్నారు. ప్రభుత్వం సక్రమంగా అమలు చేయగలిగితే పేదవారి పాలిట ఇది వరం అవుతుందని ఆమె అన్నారు. ప్రస్తుతం ఏ ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రభుత్వ, లేదా ప్రైవేట్ కంపెనీలు IVF కవర్ చేయనందున జీతం పొందే జంటలు రాష్ట్ర పథకం క్రింద చికిత్సను తీసుకోవచ్చని ప్రియాంక యాదవ్ చెప్పారు.
రాజకీయ మేనిఫెస్టోలో IFV అని విమర్శించడం మానేయాలని..ఇది స్వాగతించే అంశమని సికె బిర్లా హాస్పిటల్లోని గైనకాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అరుణ కల్రా చెప్పారు. రాజస్ధాన్లో మహిళలు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటారని.. అలాగే సంతానోత్పత్తి రేటు తగ్గటం చూస్తున్నామని.. అలాంటి వారికి IVF చికిత్స ఖర్చు తగ్గుతుందని అన్నారు. కాగా నవంబర్ 25న జరిగే ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలు తప్పకుండా అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.