Lok Sabha Elections : ఎన్నికల్లో గెలుపును శాసించేది ఏంటి? ఎన్డీయే, ఇండియా కూటముల్లో ఏం జరుగుతుందో తెలుసా?
ఎన్నికల్లో గెలుపును శాసించేది ఏంటి ? పార్టీ బ్రాండ్ ఇమేజా? అభివృద్ధి, సంక్షేమమా? ప్రాంతీయ రాజకీయ పార్టీలతో పొత్తులా?
Lok Sabha Elections 2024: ఎన్నికల్లో గెలుపును శాసించేది ఏంటి ? పార్టీ బ్రాండ్ ఇమేజా? అభివృద్ధి, సంక్షేమమా? ప్రాంతీయ రాజకీయ పార్టీలతో పొత్తులా? పాదయాత్రలా? బీజేపీ, కాంగ్రెస్ ఈ అంశాల్లో ఏ దశలో ఉన్నాయి? ఎన్డీయే, ఇండియా కూటముల్లో ఏం జరుగుతోంది? ఓ సారి పరిశీలిద్దాం..
ఏ పొలిటికల్ పార్టీకైనా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం అత్యంత కీలకం. దాని మూలంగానే ఓట్బ్యాంక్ పదిలమవుతుంది. 2014 ముందు వరకు బీజేపీకి బ్రాండ్ ఇమేజ్ లేదు. 2007 తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ పనితీరు, గుజరాత్ మోడల్ తో పాటు అప్పట్లో కేంద్రంలోని యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వంలో అవినీతి మరకల్ని ఎన్డీయే ఉపయోగించుకుంది. దీంతో 2014లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. 2019 ఎన్నికల్లో మోదీ మ్యాజిక్ పనిచేసింది. 350కి పైగా స్థానాలు గెలుచుకుంది. నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడంలో అనుసరించిన విధానాలతో ప్రధాని మోదీ తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.
బీజేపీ అంటే హిందూత్వం అనే ముద్ర ఆ పార్టీకి ప్రతికూల అంశం. అయినా..అయోధ్య రామమందిర నినాదాన్ని గట్టిగా పట్టుకుంది. గత రెండు దశాబ్దాలుగా దీన్ని ఎన్నికల అస్త్రంగా వాడుకుంటూ వచ్చింది. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్, మహిళా రిజర్వేషన్ బిల్లు, విదేశీ పర్యటనలు ఇలా ఒక్కొక్కటిగా ఎన్డీయే తీసుకున్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా.. ఓవరాల్గా మోదీ సర్కార్కు పాజిటివ్ వైబ్స్ను తీసుకొచ్చింది. ఎన్నికల ప్రచారంలో వీటిని ప్రస్తావించి మూడోసారి మోదీని ప్రధానిని చేయాలనేందుకు బీజేపీకి ఈ అంశాలు బూస్టప్ అవుతాయనేది విశ్లేషకుల అంచనా.
పక్కా స్కెచ్తో బీజేపీ..
అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో ప్రాంతీయ రాజకీయ పార్టీల ప్రభావం ఉంటుంది. వీటన్నింటినీ జాతీయ పార్టీలు తట్టుకుని నిలబడగలగాలి. ప్రాంతీయ పార్టీలతో పొత్తులు, ఎన్నికల వ్యూహాలనేవి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు కీలకం. రాష్ట్రాల రాజకీయాల్లో ఆయా ప్రభుత్వాల పాలన, అభివృద్ధి, కులాలు, ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే కూటమి కట్టే పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాల్సి ఉంటుంది.
Also Read: భారీ సొరంగాన్ని నిర్మించుకున్న మావోయిస్టులు
ఈ విషయంలో బీజేపీ పక్కా స్కెచ్తో ఉంది. ఎన్నికల సమయంలో జాతీయ నాయకత్వం మొత్తం ఆ రాష్ట్రంపై ఫోకస్ చేయడం వెనక కారణం.. వెంటనే అధికారంలోకి వస్తుందని కాదు.. ఇప్పుడు మొదలు పెడితే దశాబ్దం తర్వాతైనా పార్టీకి మంచి ఓటుబ్యాంక్ తయారవుతుందని. దక్షిణాదిలో ఎన్నికలకంటే ముందే.. బీజేపీ ఓట్బ్యాంక్ను మెల్లగా పెంచుకునేందుకు రంగంలోకి దిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్రమంగా ఓట్ బ్యాంక్ను పెంచుకుంటూ వచ్చింది. ఏపీ, కేరళ, తమిళనాడుతో పాటు అధికారం కోల్పోయిన కర్ణాటకలోనూ మళ్లీ పుంజుకునే ప్లాన్స్ వేస్తోంది.
కూటమిలో సమస్యలు పరిష్కారం అయ్యేనా?
ఇటు భారత్ జోడో యాత్రతో రాహుల్ గతేడాది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. కర్ణాటకలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇది కలిసొచ్చిందని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో మణిపుర్ నుంచి ముంబై వరకు న్యాయ్ యాత్ర చేస్తున్నారు రాహుల్. కానీ అన్నిసార్లూ ఒకే స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందని చెప్పలేం. సార్వత్రిక ఎన్నికలకు కనీసం ఏడాది ముందు నుంచే ఎన్నికల కమిటీలు, అభ్యర్థులు, గెలిచేందుకు కావాల్సిన వనరులు, ప్రచార సామాగ్రిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
Also Read: హిందువులు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇస్తూ కోర్టు తీర్పు.. అంతేకాదు..
బీజేపీ ఇప్పటికే దీనిపై పట్టుబిగించింది. కానీ కాంగ్రెస్ పెద్దన్నపాత్ర పోషిస్తున్న I.N.D.I.A కూటమి మాత్రం ఇంకా అంతర్గత సమస్యలను పరిష్కరించుకునే దశలోనే ఉంది. ఇక అభ్యర్థుల వేట ఎప్పుడు..? ఎన్నికల సమరానికి కావాల్సిన వనరులు, ప్రచార వ్యూహాలు ఎలా..? కాంగ్రెస్ ఈ విషయంలో డైలమాలోనే ఉందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. దీంతో 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిలో గెలుపోటములు ఎలావుంటాయనేది ఆయా అలయన్స్ పార్టీలు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి.