Indian Air Force: భారత వాయుసేన సత్తా ఇది
మొత్తంగా యుద్ధ క్షేత్రాన్ని తలపించేలా భారత వాయుసేన చేసిన విన్యాసాలు ప్రతిక్షణం ఉత్కంఠ రేపాయి.
ఎన్నో యుద్ధాలు… ఇంకెన్నో కీలక ఆపరేషన్లు.. దేశం లోపలా బయటా ఎన్నో ఉగ్రమూకలను ఏరిపారేసిన ఘటనలు.. ఇంకా ఎన్నెన్నో.. ఇలా చెప్పుకుంటూ పోతే భారత వైమానిక దళం విజయాలకు లెక్కే లేదు. 9 దశాబ్దాల ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఎప్పటికప్పుడు కొత్త ఆయుధాలను సమకూర్చుకుంటూ శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తూనే ఉంది. తాజాగా.. ఐఏఎఫ్ ఫోఖ్రాన్ వేదికగా తన సమర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
దేశంలోని త్రివిధ దళాల్లో కీలకమైనది భారత వాయుసేన. 90 ఏళ్లుగా దేశ రక్షణలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమైంది. పొరుగు దేశాలతో యుద్ధాలతో పాటు.. కీలక ఆపరేషన్స్లో ఎన్నోసార్లు వాయుసేన సత్తా చాటింది. అమెరికా, రష్యా, చైనా తర్వాత నాలుగు అతిపెద్ద ఫోర్స్తో ఎంతో పటిష్టంగా ఉంది భారత వాయుసేన.
మరోసారి సత్తా
అలాంటి మన వాయుసేన.. గగన సీమలో మరోసారి సత్తా చాటింది. మిసైల్స్, డ్రోన్స్, యుద్ధ విమానాలు, ఫైటర్ హెలికాప్టర్లను వినియోగించి ప్రపంచానికి తన సైనిక బలాన్ని చూపించింది. రాజస్థాన్లోని ఫోఖ్రాన్ వేదికగా జరిగిన వాయు శక్తి-2024 కార్యక్రమంలో ఎన్నో ఆపరేషన్స్ను కళ్లకు కట్టినట్లు చూపించారు.
రాఫెల్, సుఖోయ్-30 MIK, మిగ్-29, మిరాజ్-2000, తేజస్, హాక్ సహా 120కి పైగా యుద్ధ విమానాలు పోఖ్రాన్ ఎడారిలో ఆర్టిఫిషియల్గా ఏర్పాటుచేసిన శత్రు లక్ష్యాలను సక్సెస్ ఫుల్గా ధ్వంసం చేశాయి. స్వదేశీ వాయు రక్షణ వ్యవస్థలు, ఆకాశ్, సమర్ వంటి క్షిపణులను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఈ విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించారు.
తొలుత కమెండో ఆపరేషన్ ద్వారా వాయుసేన తన విన్యాసాలను ప్రారంభించింది. ఉగ్రదాడులతో పాటు కీలక ఆపరేషన్ల సమయంలో వాయుసేన కమెండోలు చేసే రెస్క్యూను ఈ సందర్భంగా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఉగ్రదాడికి గురైన భవంతి నుంచి ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పాటు.. టెర్రరిస్టులను అరెస్ట్ చేసే వరకు అన్నింటినీ కళ్లకు కట్టినట్లు చూపించారు.
ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ మేఘదూత్ నుంచి ముంబై అటాక్స్ వరకు కమెండోలు రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా చేపడతారో ఈ సందర్భంగా వివరించారు.
అధునాత ఆయుధ సంపత్తి
భారత వైమానిక దళంలోని కీలక ఆయుధాలు మిసైల్స్. వందల నుంచి వేల కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను సునాయాసంగా ధ్వంసం చేసే అధునాత ఆయుధ సంపత్తిని కలిగి ఉంది IAF. అగ్ని, పృథ్వి, ఆకాశ్, త్రిశూల్, నాగ్, బ్రహ్మోస్ ఇలా ఎన్నో రకాల మిసైల్స్తో ఎంతో బలంగా ఉంది భారత వైమానిక దళం. వీటి ద్వారా ఎన్నో కీలక ఆపరేషన్స్లో ఉగ్రమూకల ఆట కట్టించింది.
భారత సైన్యం దగ్గర 700 కిలోమీటర్ల శ్రేణి నుంచి 3 వేల 500 కిలోమీటర్ల శ్రేణి వరకు లక్ష్యాలను ఛేదించే సత్తా కలిగిన ఎన్నో మిసైల్స్ ఉన్నాయి. అంతేకాదు.. తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగు దేశాల పీచమణచేందుకు అగ్ని-5 పేరిట ఏకంగా అణ్వాస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న దీర్ఘశ్రేణి మిసైల్ను తయారు చేసింది భారత్. అయితే.. ఇందులో కీలకమైన పలు మిసైల్స్ పనితీరును వాయుశక్తి ద్వారా ప్రదర్శించారు.
ఈ ప్రదర్శనలో భాగంగా ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ శత్రు లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న ఆకాశ్ మిసైల్ను పనితీరును ప్రదర్శించారు. ఒకే ఫైరింగ్ యూనిట్ని ఉపయోగించి కమాండ్ గైడెన్స్ ద్వారా దాదాపు 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 4 లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించగల సామర్థ్యం ఆకాష్ సొంతం. ఒక ఫైరింగ్ యూనిట్, ఫైరింగ్ లెవల్ రాడార్, ఫైరింగ్ కంట్రోల్ సెంటర్, రెండు ఆకాష్ ఎయిర్ ఫోర్స్ లాంచర్లతో పాటు 5 మిసైల్స్ ఇందులో ఉంటాయి. ఇలా ఏక కాలంలో 4 లక్ష్యాలను చేధించే సత్తా ఉన్న తొలి దేశం కూడా భారత్ కావడం గమనార్హం.
M-777 శతఘ్నుల పవర్ ఇది
ఇదే సమయంలో మరో కీలకమైన ఆయుధాన్ని కూడా ప్రదర్శించింది వాయుసేన. భారత రక్షణ రంగంలో కీలకమైన M-777 శతఘ్నులు శత్రు స్థావరాలను ఎలా ధ్వంసం చేస్తాయో చూపించింది. ఈ శతఘ్ని ఫిరంగులు కొండ ప్రాంతాల్లో యుద్ధం సమయంలోనూ, టెర్రర్ ఆపరేషన్ల సమయంలో ఎంతో ఉపయోపడతాయి. కొండలను సైతం కూల్చివేయగల సామర్థ్యం ఉన్న ఈ శతఘ్నులు శత్రువులకు భారీ ఎత్తున నష్టం కలిగిస్తాయి. సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేరుకునే సత్తా వీటి సొంతం. M-777 హొవిట్జర్ శతఘ్ని బృందంలో 8 మంది సభ్యులుంటారు.
మొత్తంగా యుద్ధ క్షేత్రాన్ని తలపించేలా భారత వాయుసేన చేసిన విన్యాసాలు ప్రతిక్షణం ఉత్కంఠ రేపాయి. రెప్పపాటు వేగంతో శత్రువులపై చేసే దాడులను ప్రదర్శించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. గరుడ్ కమాండోల రెస్క్యూ ఆపరేషన్లు, యాంటీ టెర్రర్ మాక్ డ్రిల్స్, ప్రచండ్ హెలికాఫ్టర్ల సామర్థ్యం, జాగ్వార్ పనితీరు వెరసి.. వాయుసేన విన్యాసాలతో పోఖ్రాన్ రేంజ్ మార్మోగిపోయింది.
చివరగా భారత దేశ ఔన్నత్యం ఉట్టిపడేలా ట్రై సర్వీస్ బ్యాండ్తో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. జాతీయ గీతాలాపన చేయడం ద్వారా ఈ వాయుశక్తి కార్యక్రమానికి ముగింపు ఇచ్చారు.