CS Jawahar Reddy : ఏపీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలి : జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు
CS Jawahar Reddy : ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన 24 గంటలలోగా ప్రభుత్వ ఆస్తులపై అన్నిరకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలను వెంటనే తొలగించాలని సీఎస్ ఆదేశించారు.
CS Jawahar Reddy : లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలుచేయాలని ప్రభుత్వ కార్యదర్శి కేఎస్.జవహర్ రెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు శనివారం (మార్చి 16న) విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన 24 గంటలలోగా ప్రభుత్వ ఆస్తులపై అన్నిరకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలను వెంటనే తొలగించాలని సీఎస్ ఆదేశించారు.
Read Also : MP Pasunuri Dayakar : బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లో చేరిన వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్
వివిధ పబ్లిక్ ఆస్తులైన బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లో రాజకీయ యాడ్లు, వాల్ రైటింగ్లు, పోస్టర్లు, కటౌట్లను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో కూడా ప్రభుత్వ నిధులతో జారీ చేసే యాడ్లను నిలిపి వేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి :
ప్రభుత్వ వెబ్సైట్లో ప్రజా ప్రతినిధులు, మంత్రులు, రాజకీయ పార్టీల ఫొటోలను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికల ప్రకటన తర్వాత మంత్రులు ఎవరు కూడా అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం కోసం వాడరాదని స్పష్టం చేశారు. మంత్రుల ఎన్నికల పర్యటనకు ప్రభుత్వ అతిథి గృహాలను కేటాయించరాదని కలెక్టర్లకు సూచించారు. ఎంపీ, ఎమ్మెల్యే నిధులు, ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో వాటర్ ట్యాంకులు, అంబులెన్సులపై ఎమ్మెల్యేలు, ఎంపీల ఫొటోలు ఉండరాదని సూచించారు. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో పీఎం, సీఎం సహా మంత్రుల ఫొటోలు ఉండకూడదన్నారు. మంత్రులు, అధికారుల మధ్య ఎలాంటి వీడియో సమావేశాలు నిర్వహించరాదన్నారు.
నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు :
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో నీటి బిల్లులు, విద్యుత్, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు, బోర్డింగ్ పాస్లపై ప్రజాప్రతినిధుల ఫొటోలు, మెసేజ్లు వంటివి ఉండకూడదని ఆయన సూచించారు. ప్రభుత్వ అధికారులు ఎవరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తు అనుమతి లేకుండా కేంద్ర కార్యాలయాలను విడిచి వెళ్లడానికి వీలు లేదన్నారు. అంతేకాదు.. ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేయడానికి వీలులేదన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా ఆ పార్టీల ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, గిఫ్టులు, ఇతర లబ్దిలను పొందడం చేసే వారిపై సీసీఏ నిబంధనలు ప్రకారం.. ఐపీసీ సెక్షన్ 171, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123, 129, 134, 134ఎ నిబంధనలు ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని సీఎస్ వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రావిజన్ ఉన్నా కొత్త ప్రాజెక్టులు, పథకాల మంజూరు, గ్రాంట్లు, హామీలు, శంకుస్థాపనలు చేయడం పూర్తిగా నిషేధమన్నారు.
వర్క్ ఆర్డర్ ఉన్నప్పటికీ కేత్రస్థాయిలో ప్రారంభం కాని ఎలాంటి పనులు చేపట్టకూడదన్నారు. పనులు పూర్తి అయినా నిధులు విడుదలలో ఎలాంటి నిషేధం లేదన్నారు. సీఎం, పీఎం సహాయ నిధి ద్వారా కిడ్ని, గుండె, కేన్సర్ రోగుల చికిత్సల కోసం సకాలంలో అందించే నిధులు మంజూరుకు ఆయా శాఖలకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్పీలు, పలువురు అధికారులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
Read Also : BSP-BRS Alliance : బీఆర్ఎస్తో పొత్తుని అందుకే నిరాకరిస్తున్నాం.. బీఎస్పీ సంచలన ప్రకటన..!