Rohit Sharma : 5 రోజుల వ్యవధిలో 3 మ్యాచులు.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..
టీ20 ప్రపంచకప్లో గ్రూపు దశలో వరుస విజయాలు సాధించింది టీమ్ఇండియా. ఇప్పుడు సూపర్ 8 మ్యాచులకు సిద్ధమవుతోంది.
![Rohit Sharma : 5 రోజుల వ్యవధిలో 3 మ్యాచులు.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. Rohit Sharma : 5 రోజుల వ్యవధిలో 3 మ్యాచులు.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..](https://10tv.in/wp-content/uploads/2024/06/Rohit-Sharma-Opens-Up-On-India-Big-Challenge-Ahead-Of-T20-World-Cup-Super-8s.jpg)
PIC Credit : BCCI
Rohit Sharma – T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్లో గ్రూపు దశలో వరుస విజయాలు సాధించింది టీమ్ఇండియా. ఇప్పుడు సూపర్ 8 మ్యాచులకు సిద్ధమవుతోంది. ఐదు రోజుల వ్యవధిలో మూడు మ్యాచులు ఆడనుంది. ఈ బిజీ షెడ్యూల్ పై టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఐసీసీని పరోక్షంగా విమర్శించాడు. దీన్ని సాకుగా చూపమని, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నం చేస్తామని అన్నాడు.
‘గ్రూపు దశ నుంచి సూపర్ 8కి చేరుకున్నాము. ఈ దశలో వైవిధ్యంగా ఆడాల్సి ఉంది. కఠినమైన ప్రత్యర్థులతో తలపడనున్నాము. ప్రతి ఒక్క ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం ప్రాక్టీస్ సెషన్లలో చాలా సీరియస్గా శ్రమిస్తున్నాము. ప్రతి సెషన్లోనూ ఓ కొత్త నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడంపై దృష్టిపెట్టాము.’ అని రోహిత్ అన్నాడు.
‘సూపర్ 8లో ఒక్కసారి బరిలోకి దిగిన తరువాత స్వల్ప వ్యవధిలోనే కీలక మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇది కాస్త హడావుడిగా ఉంది. చాలా సార్లు ఇలా ఆడాము. అయితే.. మ్యాచుల కోసం ఎక్కువగా ప్రయాణించాల్సి ఉంటుంది. దీనిని కారణాలుగా చెప్పాలనుకోవడం లేదు. వెస్టిండీస్లో ఆడిన అనుభవం ఉంది. ఇక్కడ చాలా మ్యాచుల్లో గెలిచాం. ఇక ఎక్కడ ఆడినా కూడా గెలిచేందుకు వందశాతం కష్టపడుతాం. గ్రూపు స్టేజీలో ఆడినట్లుగానే ఓ జట్టుగా సూపర్ 8లోనూ ఆడుతాం. సూపర్ 8లో సత్తా చాటాలని ప్రతి ఒక్క ఆటగాడు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.’ అని రోహిత్ శర్మ తెలిపాడు.
భారత జట్టు సూపర్-8 షెడ్యూల్ ఇదే..
జూన్ 20న అఫ్గానిస్థాన్ (బార్బడోస్)
జూన్ 22న బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)
జూన్ 24న ఆస్ట్రేలియా (లూసియా)
కాగా.. ఈ మ్యాచులు అన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి.