Ishan Kishan : ఇషాన్ కిషన్ దారెటు..? టీమ్ఇండియాలో రీ ఎంట్రీ కష్టమేనా..? ఒక్కటే మార్గం..!
శ్రీలంక పర్యటనకు బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేసింది. ప్రస్తుతం అందరి దృష్టి ఇషాన్ కిషన్ పైనే పడింది.
Ishan Kishan – Team India : శ్రీలంక పర్యటనకు బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేసింది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి యువ ఆటగాడు, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పైనే పడింది. టీ20, వన్డే రెండు జట్లలోనూ ఇషాన్ స్థానం దక్కించుకోలేకపోయాడు. అసలు అతడిని సెలక్టర్లు పరిగణలోకే తీసుకోలేదనే వార్తలు వస్తున్నాయి. రంజీలకు దూరంగా ఉండడం, సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్ మళ్లీ జాతీయ జట్టులో ఆడే అవకాశం ఉందో లేదో ఓ సారి చూద్దాం..
గతేడాది దేశవాలీ క్రికెట్లో ఆడకపోవడంతో ఇషాన్ కిషన్తో పాటు శ్రేయస్ అయ్యర్లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లు ఇవ్వలేదు. అయితే.. తాజాగా ప్రకటించిన వన్డే జట్టులో మాత్రం శ్రేయస్ కు చోటు దక్కింది. దీంతో త్వరలోనే అతడు సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా అందుకోనున్నాడు. గంభీర్ మెంటార్గా ఉన్న కేకేఆర్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమ్ఇండియా హెడ్ కోచ్గా గంభీర్ రావడం శ్రేయస్కు కలిసి వచ్చిందని అంటున్నారు.
Shashi Tharoor : లంక పర్యటనకు భారత జట్టు ఎంపిక.. సెలక్టర్లపై శశి థరూర్ మండిపాటు..
ఇక ఇషాన్ కిషన్ జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. అతడు ఖచ్చితంగా దేశవాలీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు రియాన్ పరాగ్ను ఉదాహరణగా చూపిస్తున్నారు. గతేడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ఏడు మ్యాచుల్లో ఏడు అర్థశతకాలు బాదిన పరాగ్ ను లంక టూర్కు ఎంపిక చేశారు. దేశవాలీలో రాణిస్తేనే జాతీయ జట్టులో చోటు ఉంటుందని దీని ద్వారా చెప్పినట్లేనని చెబుతున్నారు.
జాతీయ సెలక్షన్ కమిటీ దేశవాలీ క్రికెట్ ప్రదర్శనలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తుందని బీసీసీఐ తాజాగా జరిగిన సమావేశంలో స్పష్టత ఇచ్చింది. ఈ లెక్కన రాబోయే దేశవాలీ సీజన్ 2024-25లో ఇషాన్ కిషన్ ఆడడంతో పాటు రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ బీసీసీఐ సూచించినట్లు ఇషాన్ కిషన్ దేశవాలీ క్రికెట్ ఆడతాడో లేదో చూడాల్సిందే.
IND vs PAK : ఇవాళ భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్.. మనోళ్లు సత్తాచాటేనా..