Union Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు నిధుల వరద.. తెలంగాణకు నిరాశ

ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో నిధుల వరద పారింది.

Union Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు నిధుల వరద.. తెలంగాణకు నిరాశ

Union Budget 2024: ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్‌లో నిధుల వరద పారింది. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం నిరాశే ఎదురైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఈ రెండు రాష్ట్రాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాధాన్యత దక్కింది. ముఖ్యంగా ఏపీకి అన్నివిధాలుగా అండగా ఉంటామనే భరోసాను బడ్జెట్ ద్వారా మోదీ సర్కారు కల్పించింది. రాజధాని, పోలవరం ప్రాజెక్టు, ఇండస్ట్రియల్ కారిడార్ వంటి కీలక అంశాలను బడ్జెట్‌లో కేంద్రం ప్రస్తావించింది.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. విభజన హామీలను నెరవేరుస్తామన్నారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామమని హామీయిచ్చారు.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్టు చెప్పారు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి సాయం చేస్తామన్నారు. ఏపీలో గ్రామీణాభివృద్ధి పథకాలకు రూ.2.66 లక్షల కోట్లు కేటాయించారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల నిర్మాణానికి ప్రత్యేక సహకారం చేస్తామని హామీయిచ్చారు.

తెలంగాణకు మొండిచేయి
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపారు. రాష్ట్రానికి పెద్దగా నిధులు కేటాయించలేదు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఢిల్లీ వెళ్లి కోరినా మోదీ సర్కారు దయ చూపలేదు. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని మాత్రమే బడ్జెట్‌లో ప్రస్తావించారు. మిగతా రంగాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో కేటాయింపులు లేవని తెలుస్తోంది.