15 వేల కోట్లు ముష్టి పడేస్తే పండగ చేసుకోవాలా?: కేంద్ర బడ్జెట్‌పై వైఎస్ షర్మిల ఫైర్

15 వేల కోట్లు ముష్టి పడేస్తే మేము పండగ చేసుకోవాలా? ఎందుకు చేసుకోవాలి? టీడీపీ 16 మంది ఎంపీలు ఒక్కొక్కరినీ వెయ్యి కోట్లకు బీజేపీ కొనుక్కున్నాట్టా?

15 వేల కోట్లు ముష్టి పడేస్తే పండగ చేసుకోవాలా?: కేంద్ర బడ్జెట్‌పై వైఎస్ షర్మిల ఫైర్

Andhra Pradesh Congress Chief YS Sharmila comments on Union Budget 2024

YS Sharmila on Union Budget 2024: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై ఎన్నికల మ్యానిఫెస్టోను తలపించిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. లక్ష కోట్లు అడిగితే 15 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. బడ్జెట్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే సెన్సెక్స్ 1200 పాయింట్స్ పడిపోయిందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదని గుర్తు చేశారు.

”పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదని అని నిర్మలా సీతారామన్ చెప్పారు. 12 వేల కోట్లు పునరావాసానికి అవసరం అని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎంత డబ్బులు కేటాయించారు.. పునరావాసం పరిస్థితి గురించి బడ్జెట్‌లో ఒక్క మాట చెప్పలేదు. కర్నూల్, కోపర్తి దగ్గర ఇండ్రస్ట్రీ హబ్‌కి ఎంత ఇస్తారో స్పష్టంగా చెప్పలేదు. బడ్జెట్ అంటే అంకెలకి సంబంధించిన అంశం. వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్స్ ఇస్తామని చెప్పారు.. కానీ ఇంత ఇస్తారనేది ఎక్కడా చెప్పలేదు. అసలు కేంద్రం ఎంత ఇస్తుందో టీడీపీ, జనసేనకి తెలుసా?

ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కి అత్యంత కీలకం.. కానీ దాని గురించి బడ్జెట్‌లో ఒక్క మాట లేదు. ప్రత్యేక హోదా ఇవ్వదలచుకోలేదా? ఆ విషయం చెప్పగలరా? ఉభయ సభల్లో ప్రత్యేక హోదా అప్రూవ్ అయ్యింది.. కానీ బీజేపీ ఒక్క మాట మాట్లాడం లేదు. బిహార్‌కి ఇవ్వడం లేదని కేంద్రం చెప్పింది.. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? బిహార్‌కి ఇస్తారో లేదో అది బీజేపీ ఇష్టం.. కానీ ఆంధ్రప్రదేశ్‌కిఇచ్చి తీరాలి. ప్రత్యేక హోదా లేకపోతే ఇండ్రస్ట్రీలు ఎందుకు వస్తాయి? 15 వేల కోట్లు ముష్టి పడేస్తే మేము పండగ చేసుకోవాలా? ఎందుకు చేసుకోవాలి? టీడీపీ 16 మంది ఎంపీలు ఒక్కొక్కరినీ వెయ్యి కోట్లకు బీజేపీ కొనుక్కున్నాట్టా? ఇదెక్కడి న్యాయమని అగుతున్నాను.

Also Read : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సాధించిన విజయం: కేంద్ర బడ్జెట్‌పై జనసేన

విభజన చట్టంలోని మిగతా హామీల సంగతేంటి.. రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ.. వీటన్నింటికీ నిధులు అవసరం లేదా? విజయవాడ, విశాఖలో మెట్రోరైళ్లు అవసరం లేదా? ఆంధ్రప్రదేశ్‌కి 10 ఏళ్లు మోసం చేసిన మోదీతో బాబు జాతకట్టారు. 2022 నాటికి దేశంలో అందరికీ ఇళ్లు అన్నారు.. ఇప్పుడు మళ్లీ 3 కోట్ల ఇళ్లు అంటున్నార”ని షర్మిల మండిపడ్డారు.