కలకలం.. జనసేన ఎమ్మెల్యే కారుపై దుండగుల దాడి

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దాడి చేసింది ఎవరు అనే తెలుసుకునే పనిలో పడ్డారు.

కలకలం.. జనసేన ఎమ్మెల్యే కారుపై దుండగుల దాడి

Attack On Mla Chirri Balaraju Car : ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దుండగులు దాడి చేశారు. కారులో ఇంటికి వెళ్తుండగా జీలుగుమిల్లి మండలం బర్రిలంకలపాడు సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కారు వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే బాలరాజు గత వారం రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా తిరుగుతున్నారు. బాధితులకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఐటీడీఏ కన్నాపురం ప్రాంతంలో ఒక ఉద్యోగి పనివేళలో పబ్జీ గేమ్ ఆడుతుంటే అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, అతడిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు కోరారు ఎమ్మెల్యే బాలరాజు.

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు బాలరాజు. తన కార్యక్రమాలను ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో జీలుగుమిల్లి మండలం బర్రిలంకలపాడు దగ్గర.. ఆయన ఇంటికి సమీపంలోనే కారుపై దాడి జరిగింది. అదృష్టవశాత్తు ఆ కారులో ఎమ్మెల్యే బాలరాజు లేరు. దాని వెనుకున్న మరో కారులో ఆయన ఉన్నారు. ఆ కారులోనే ఎమ్మెల్యే ఉన్నారని భావించి దుండగులు బర్రిలంకలపాడు అడ్డ రోడ్డు వద్ద దాడి చేశారు. కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే కారులో ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ముగ్గురు కిందకు దిగి దాడికి పాల్పడ్డ వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే, వారు అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ దాడి విషయాన్ని ఎమ్మెల్యే బాలరాజు వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దాడి చేసింది ఎవరు అనే తెలుసుకునే పనిలో పడ్డారు. దీనిపై తన అభిమానులకు, నియోజకవర్గ ప్రజలకు సందేశం ఇచ్చారు ఎమ్మెల్యే బాలరాజు. తన కారుపై దాడి జరిగిన మాట వాస్తవమే అన్నారు. అయితే, ఆ కారులో తాను లేనని, తన అనుచరులు ఉన్నారని చెప్పారు. వారికి కూడా ఎలాంటి గాయాలు అవ్వలేదన్నారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దాడిలో తన కారు అద్దాలు మాత్రమే ధ్వంసమయ్యాయని ఎమ్మెల్యే బాలరాజు వెల్లడించారు. చీకటి పడటంతో దాడికి పాల్పడ్డ వారిని గుర్తించలేకపోయామని ఎమ్మెల్యే అనుచరులు తెలిపారు.

Also Read : వైసీపీకి బిగ్ షాక్‌ తప్పదా? అధికార పార్టీకి దగ్గరవుతున్న ఎమ్మెల్సీలు..!