IND vs SL : తొలి వన్డేలో మీరు ఈ విషయాన్ని గమనించారా..? చేతికి నల్ల రంగు బ్యాండ్లతో భారత ఆటగాళ్లు..
మ్యాచ్లో భారత ఆటగాళ్లు చేతికి నల్ల రంగు బ్యాండ్లతో బరిలోకి దిగారు.
![IND vs SL : తొలి వన్డేలో మీరు ఈ విషయాన్ని గమనించారా..? చేతికి నల్ల రంగు బ్యాండ్లతో భారత ఆటగాళ్లు.. IND vs SL : తొలి వన్డేలో మీరు ఈ విషయాన్ని గమనించారా..? చేతికి నల్ల రంగు బ్యాండ్లతో భారత ఆటగాళ్లు..](https://10tv.in/wp-content/uploads/2024/08/India-players-wear-black-armbands-in-memory-of-Anshuman-Gaekwad.jpg)
India players wear black armbands in memory of Anshuman Gaekwad
IND vs SL 1st ODI : మూడు మ్యాచుల టీ20 సిరీస్ను గెలిచి మంచి ఊపు మీదున్న టీమ్ ఇండియా అదే ఉత్సాహంతో వన్డే సిరీస్నూ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో కొలంబో వేదికగా శ్రీలంకతో తొలి వన్డే మ్యాచులో తలపడుతోంది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు చేతికి నల్ల రంగు బ్యాండ్లతో బరిలోకి దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.
భారత ఆటగాళ్లకు నల్ల రంగు బ్యాండ్లతో బరిలోకి దిగడానికి ఓ కారణం ఉంది. బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతూ టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ జూలై 31(బుధవారం) కన్నుమూశారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ కు నివాళిగా టీమ్ఇండియా ఆటగాళ్లు నల్ల రంగు బ్యాండ్లలు ధరించారు.
Virat Kohli : శ్రీలంకతో వన్డే సిరీస్.. సచిన్ ఆల్టైమ్ రికార్డు పై కోహ్లీ కన్ను..
అన్షుమాన్ గైక్వాడ్ టీమ్ఇండియా తరుపున మొత్తం 40 టెస్టులు, 15 వన్డే మ్యాచ్ లు ఆడాడు. రెండింటిలో కలిపి 2254 పరుగులు చేశాడు. టెస్టుల్లో 1983లో జలంధర్ లో పాకిస్థాన్ పై 201 పరుగుల అత్యధిక స్కోరు చేశాడు. అంతేకాదు.. తన వన్డే కెరీర్ లో అతను రెండు సెంచరీలతో 1154 పరుగులు చేశాడు.
గైక్వాడ్ 1997-1999 మధ్య, అదేవిధంగా 2000 సంవత్సరంలో రెండు దఫాలు భారత జట్టుకు ప్రధాన కోచ్ గా పనిచేశాడు. అతని కోచింగ్ లో భారత్ జట్టు 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోపీలో రన్నరప్ గా నిలిచింది. అతను కోచ్ గా ఉన్న సమయంలోనే అనిల్ కుంబ్లే న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టెస్టు ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు. గైక్వాడ్ 1990లలో జాతీయ సెలెక్టర్ గా, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సాంక (51), జనిత్ లియానాగే (1) లు క్రీజులో ఉన్నారు.