విశాఖ రైల్వేస్టేషన్లో తప్పిన పెనుప్రమాదం.. దగ్దమైన రైలు బోగీలు
విశాఖ పట్టణం రైల్వే స్టేషన్ పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్ లో ఆగిఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Train Accident in Visakhapatnam railway station : విశాఖ పట్టణం రైల్వే స్టేషన్ లో పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్ లో ఆగిఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్ ప్రెస్ రైలు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బీ6, బీ7, ఎం1 ఏసీ బోగీలు దగ్దమయ్యాయి. రైలులో మంటలు వ్యాపించిన సమయంలో ఏసీ బోగీల్లో ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన కొందరు ప్రయాణికులు అద్దాలను పగలగొట్టుకొని బయటకు వచ్చారు. మరికొందరిని స్థానిక రైల్వే సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా రైలులో మంటలు వ్యాపించడంతో స్టేషన్ లోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
Also Read : Road Accident : నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
బీ7 బోగీలోని మరుగుదొడ్డిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. రైలు బోగీల్లో మంటల చెలరేగడంతో రైల్వే స్టేషన్ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకుంది. రైల్వే స్టేషన్ లో ప్రమాదం జరగడంతో ప్రయాణికులు సేఫ్ గా బయటపడ్డారు.. రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగితే పెను ప్రమాదమే చోటు చేసుకునే అవకాశాలు ఉండేవని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై రైల్వే ఏసీపీ ఫకీరప్ప మాట్లాడుతూ.. నాలుగు ఏసీ బోగీలకు మంటలు వ్యాపించాయి. ప్రయాణికులందరినీ సేఫ్ గా కిందకు దించడం జరిగింది, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. బెడ్ షీట్స్, పైనఉన్న థర్మాకోల్ సీట్స్, ఏసీ సిస్టమ్ మాత్రమే దగ్గదమయ్యాయని, ప్రస్తుతం ట్రాక్ క్లియర్ చేస్తున్నామని ఫకీరయ్య చెప్పారు.