దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి.. ఆసుపత్రి వద్ద బాధితుల ధర్నా

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి.. ఆసుపత్రి వద్ద బాధితుల ధర్నా

Devarapalli Road Accident: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ బోల్తా కొట్టిన ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందన్నారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యంపై చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీయిచ్చారు. మంగళవారం రాత్రి జీడిపిక్కల లోడ్‍తో జంగారెడ్డిగూడెం నుంచి పెరవలి వెళుతున్న వెళుతున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: వైఎస్‌ జగన్‌
చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కూలీలు ప్రాణాలు కోల్పోవడంపై పురందేశ్వరి ఆవేదన
దేవరపల్లి రోడ్డు ప్రమాద ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటించారు. లారీ బోల్తా కొట్టిన ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందడంపై పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు.

Also Read : అర్థరాత్రి వేళ తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ప్రమాద బాధితుల ధర్నా
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోడ్డు ప్రమాద బాధితులు ధర్నా చేపట్టారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. జీడిగింజల ఫ్యాక్టరీ యాజమాన్యం మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.