Paddy Transplanter : వరి వెదజల్లే పద్ధతికే మొగ్గుచూపుతున్న రైతులు
నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకునే అవకాశముంది. అయితే ఈ విధానంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. కలుపు నివారణ చర్యలు చేపడుతూనే సకాలంలో ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. భూమికి ఎంత మేర పోషకాలు అవసరమో.. అంతే వేయడం వల్ల పెట్టుబడులు కూడా తగ్గుతాయి.

Paddy Transplanter
Paddy Transplanter : సంప్రదాయ వరిసాగుకు భిన్నంగా.. నీటి వినియోగం, పెట్టుబడి వ్యయం తగ్గించుకొని మెట్టపద్దతిలో అధిక విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారు రైతులు. ఈ విధానంలో ఎకరాకు 5 వేల ఖర్చు తగ్గడమే కాకుండా.. తక్కువ సమయంలో పంట చేతికి వచ్చి.. దిగుబడి కూడా పెరుగుతుండటంతో శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది రైతులు ఈ విధానాన్నే పాటిస్తున్నారు. అయితే అధిక దిగుబడులను పొందాలంటే కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అమరజ్యోతి.
READ ALSO : Sugarcane Cultivation : చెరకులో రసంపీల్చే పురుగుల నివారణ
సాంకేతికత పరంగా మనం ఎంత ముందుకు సాగుతున్నా.. వ్యవసాయ రంగంలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. పాత పద్ధతుల్లో వ్యవసాయం వలన అన్నదాతలకు ఎక్కువ శ్రమ, పెట్టుబడి వ్యయం అవుతుండగా.. దిగుబడి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈక్రమంలో వరిసాగులో సంప్రదాయ పద్ధతులను పక్కనబెట్టి.. పొడిదుక్కిలో నేరుగా వెదజల్లే విధానంలో వరిసాగును అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రైతులు. నేరుగా వెదజల్లే పద్ధతిలో ఎకరాకి 15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. పంట 7 నుండి 10 రోజులు ముందగా కోతకు వస్తుంది.
READ ALSO : Sugar Exports Ban : ఏడేళ్లలో మొదటిసారి చక్కెర ఎగుమతులపై నిషేధం ?
నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు. కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి రూ. 2500 నుండి 3 వేల వరకు తగ్గుతుంది. మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10 నుండి 15 శాతం వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకొని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతి కూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా చేతికి వస్తోంది.
నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకునే అవకాశముంది. అయితే ఈ విధానంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. కలుపు నివారణ చర్యలు చేపడుతూనే సకాలంలో ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. భూమికి ఎంత మేర పోషకాలు అవసరమో.. అంతే వేయడం వల్ల పెట్టుబడులు కూడా తగ్గుతాయి. వరికి ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్ అధికంగా అవసరమైన పోషకాలు. వీటితో పాటు సూక్ష్మపోషకాల లోపాలు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అమరజ్యోతి.