Irrigation Method In Paddy : వరిలో ఆరుతడి నీటి పారుదల పద్ధతితో సాగునీటి ఆదా!
ఈ విధంగా ఏకాంతరంగా పొలంలో నీరు పెడుతూ, ఆరపెడుతూ ఉండడం వల్ల సాగు నీరు ఆదా అవ్వడమే కాకుండా మిథేన్ వాయువు ఉద్ఘారాలుకూడా తగ్గి వాతావరణ సమతుల్యత కాపాడబడుతుంది. పెట్టిన నీరు క్రమంగా తగ్గుతూ పివిసి పైపులో నేల ఉపరితలం నుండి 10 సెం.మీ. లోతు వరకు పడిపోయే సమయం 1-7 రోజుల వరకు ఉంటుంది.
Irrigation Method In Paddy : వరి సాగులో నీరు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సరైన నీటి వసతి లేకుంటే వరి సాగు అనేది సాధ్యపడదు. నీటి ఎద్దడి పరిస్ధితులు ఏర్పడితే ఆ ఏడాది వరిసాగు చేపట్టటటం కష్టతరంగా మారుతుంది. ప్రస్తుతం వ్యవసాయ అవసరాలకు సరిపడినంత నీరు లభించని పరిస్ధితులు ఉన్నాయి. భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. దీంతో తీవ్ర నీటి ఎద్దడి పరిస్ధితులను వరి సాగు చేస్తున్న రైతులు చవి చూడాల్సి వస్తుంది.
అదే క్రమంలో సాంప్రదాయ వరిసాగు పద్ధతిలో నీరు ఎక్కువగా నిల్వ ఉంచడం వల్ల ఎక్కువ మోతాదులో మిథేన్ వాయువు వెలువడి వాతావరణ సమతుల్యత దెబ్బతిని గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మానవ సంబంధిత హరిత గృహవాయువుల ఉద్ఘారాల్లో దాదాపుగా 15% వ్యవసాయ రంగం నుండే వెలువడుతున్నాయి. వీటిలో 46% నైట్రస్ఆక్సైడ్, 45% మిథేన్, 9% కార్భన్దైఆక్సైడ్ రూపాల్లో వెలువడుతున్నాయి.
ఈ నేపద్యంలో వాతావరణ సమతుల్యత, నీటి పొదుపు దృష్టిలో ఉంచుకొని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం సాగు నీటి రక్షణ సాంకేతిక పద్ధతులను అఖివృద్ధి చేశారు. అందులో ప్రధానమైనది ఏకాంతరంగా నీరుపెడుతూ ఆరబెట్టే ఆరుతడి నీటిపారుదల పద్ధతి. ఈ విధానంలో 30 సెం.మీ. పొడవు, 15 సెం.మీ వెడల్పు ఉన్న పి.వి.సి పైపును ఎంచుకోవాలి. దీనికి 20 సెం.మీ. పొడవు వరకు 2 సెం.మీ దూరంలో 5 మి.మీ. వ్యాసం కలిగిన రంధ్రాలను ఏర్పాటు చేయాలి.
సమాంతరంగా చదును చేసి నాట్లువేసిన పొలంలో 2 వారాల తరువాత గమనించడానికి సులువుగా ఉన్న ఒడ్డు, గట్టు పక్కన ఈ పివిసి పైపును రంద్రాలున్నంత భాగం వరకు పాలంలోని నేలలో పాతాలి. పాతిన పివిసి పైపులో రంద్రాలున్న 20 సెం.మీ. నుండి క్రమంగా పైపు అడుగు భాగం వరకు పైపులోని మట్టిని తీసివేయాలి. నేల ఉపరితలం నుండి 5 సెం.మీ. వరకు పొలంలో నీరు పెట్టాలి. అప్పుడు పివిసి పైపు మరియు నేల ఉపరితలంపై 5 సెం.మీ. ఎత్తు వరకు నీరుంటుంది.
ఈ విధంగా ఏకాంతరంగా పొలంలో నీరు పెడుతూ, ఆరపెడుతూ ఉండడం వల్ల సాగు నీరు ఆదా అవ్వడమే కాకుండా మిథేన్ వాయువు ఉద్ఘారాలుకూడా తగ్గి వాతావరణ సమతుల్యత కాపాడబడుతుంది. పెట్టిన నీరు క్రమంగా తగ్గుతూ పివిసి పైపులో నేల ఉపరితలం నుండి 10 సెం.మీ. లోతు వరకు పడిపోయే సమయం 1-7 రోజుల వరకు ఉంటుంది. నేల యొక్క స్వభావం, వాతావరణ పరిస్థితులు మరియు పంట యొక్క దశలపై ఆధారపడి ఉంటుంది.
ఈ పద్ధతి వల్ల కలిగే లాభాలకు సంబంధించి ఈ పద్ధతిలో దాదాపు 35 శాతం వరకు నీటి ఆదా అవుతుంది. సాంప్రదాయ వరిసాగు కంటే కూడా దిగుబడులు అధికంగా
ఉంటాయి. నీటి పారుదల ఖర్చులు తగ్గుతాయి. ప్రకృతి విపత్తుల సమయంలో పంట మొక్కలు పడిపోకుండా కాండం ధృఢంగా ఉంటుంది. హరితగృహవాయు ఉద్దారాలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ నీటిపారుదల పద్ధతిని అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో, వర్షాధారిత ప్రాంతాల్లో, చివరి ఆయకట్టు ప్రాంతాల్లో చేపట్టటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.