Ap Government : కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఏపీ లేఖ
కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ఆపేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది.
Ap Government : కృష్ణా జలాల వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల నేతలు ఈ సమస్య పరిష్కారం కొరకు కృష్ణానది యాజమాన్య బోర్డుకు అనేక సార్లు లేఖలు రాశారు. లెక్కకు మించి నీటిని వినియోగిస్తున్నారంటూ ఇరు రాష్ట్రాల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖరాసింది. శ్రీశైలం జలాశయంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా చూడాలని కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం కోరింది. విద్యుత్ ఉత్పతి వల్ల నీటిమట్టం తగ్గుతోందని లేఖలో పేర్కొంది. నీటిమట్టం 854 అడుగులకు చేరితే రాయలసీమకు నీరు ఇవ్వలేమని లేఖలో ఏపీ ఈఎన్సీ పేర్కొన్నారు.
చెన్నైకి కూడా తాగునీటిని సరఫరా చేయలేమని తెలిపారు. విద్యుత్ ఉత్పాదనతో వస్తున్న నీటిని సాగర్లో నిలపలేమని ఈఎన్సీ పేర్కొన్నారు. సాగర్లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉందని, విద్యుత్ ఉత్పాదనలో కిందికి విడిచిపెట్టిన నీటిని తెలంగాణ కోటానుంచి మినహాయించాలని ఏపీ లేఖలో పేర్కొంది.