YSR Bhima Scheme : ఏపీలో మరో పథకం ప్రారంభం, 1.32 కోట్ల కుటుంబాలకు లబ్ధి
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో మరో పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో 'వైఎస్ఆర్ ఉచిత బీమా' స్కీమ్ ని లాంచ్ చేశారు. ఈ పథకం ద్వారా
YSR Bhima Scheme : ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో మరో పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ‘వైఎస్ఆర్ ఉచిత బీమా’ స్కీమ్ ని లాంచ్ చేశారు. ఈ పథకం ద్వారా 1.32 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, రూ. 750 కోట్లతో నూతన మార్గదర్శకాలతో దీన్ని ప్రారంభించామని సీఎం జగన్ తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా పథకాన్ని అమలు చేయనున్నారు.
18-50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తి సహజంగా మరణిస్తే రూ.లక్ష బీమా వస్తుందని సీఎం తెలిపారు. అలాగే, 18-70 ఏళ్ల వారు ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యం సంభవించినా రూ.5 లక్షల బీమా ఇస్తారని చెప్పారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ ఈ పథకం అందుతుందని తెలిపారు. 155214 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఈ పథకంపై సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు.
గతేడాది ఏప్రిల్ లో ఈ పథకం నుంచి కేంద్రం తప్పుకుందని సీఎం చెప్పారు. అయినప్పటికీ పేదలకు మేలు చేయాలని మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, బీమా చెల్లింపునకు అయ్యే పూర్తి ఖర్చు బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రెండేళ్లలో మొత్తం రూ.1,307 కోట్ల మేర బీమా రక్షణ అమలులో ఉందన్నారు. ప్రజలకు ఈ బీమా గురించి తెలిపే బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించామని సీఎం తెలిపారు.
రూ.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారిని ఆరోగ్యశ్రీలో చేర్చినట్టుగా సీఎం జగన్ గుర్తు చేశారు. వెయ్యికి పైగా రోగాలను గుర్తించి ఆరోగ్యశ్రీలో చేర్చామన్నారు. కుటుంబ పెద్ద చనిపోతే బీమా సొమ్మును బాధిత కుటుంబానికి అందిస్తామన్నారు.