AP Crime : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటనలో సీఐ, ఎస్సై సస్పెన్షన్‌

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటనలో సీఐ, ఎస్సైలపై సస్పెన్షన్‌ వేటు పడింది.

AP Crime : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటనలో సీఐ, ఎస్సై సస్పెన్షన్‌

Ci And Si Suspention In Vijayawada Govt Hospital Gang Rape

CI And si suspention in vijayawada govt hospital gang rape : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలైన యువతిపై ముగ్గురు మానవ మృగాలు అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టిన ఘటనలో పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఐ, సెక్టార్‌ ఎస్సైపై సస్పెన్షన్‌ వేటు వేసింది. గురువారం (ఏప్రిల్ 21,2022) వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. నిత్యం ఆసుపత్రికి వచ్చే రోగులు, ఇతరులతో అత్యంత రద్దీగా ఉండే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఏప్రిల్ 19, 20న ఈ ఘోరం చోటుచేసుకుంది. ముప్పై గంటల పాటు మృగాలా చేతిలో బాధితురాలు నరకం చూసింది. అయితే ఈ ఘటనలో పోలీసుల ఘోర నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది.

తమ కూతురు కనిపించడం లేదంటూ వాంబే కాలనీకి చెందిన బాధిత యువతి తల్లిదండ్రులు 20వ తేదీన ఉదయం నున్న పోలీసులను ఆశ్రయించగా.. ఇప్పుడు కాదు సాయంత్రం రావాలంటూ బాధితులను స్టేషన్ సిబ్బంది తిప్పి పంపించారు. ఇక్కడే పోలీసులు ఎంతటి నిర్లక్ష్యం ప్రదర్శించారో అర్ధం అవుతుంది. చివరిసారిగా ఫలానా నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చిందని ఆధారమిచ్చినా సరే వెంటనే చర్యలు చేపట్టలేదు. అప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం వీడలేదు. ఆ తరువాత ఆమెపై విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచారం జరిగింది. పోలీసుల అలసత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఐ హనీష్‌, ఎస్సై శ్రీనివాసరావును విజయవాడ సీపీ కాంతిరాణా టాటా విధుల నుంచి సస్పెండ్‌ చేశారు.

పోలీసుల నిర్లక్ష్యానికి ఛిద్రమైపోయిన వికలాంగరాలి జీవితం
కాగా జరగాల్సిన ఘోరం జరిగాక పోలీసులను సస్పెండ్ చేస్తే లాభమేంటి? పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఓ వికరాలాంగురాలిపై ఇటువంటి పాశవిక ఘటన జరిగింది. తమ కుమార్తె ఆచూకీ కనిపెట్టాలని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఇక చేసేదేమిలేక పోలీసులు చెప్పినట్టుగానే 20వ తేదీ సాయంత్రం స్టేషన్ కు వచ్చి తమ వద్ద నున్న ఫోన్ నెంబర్ ను పోలీసులకు చూపించారు. ఆ నెంబర్ ద్వారా శ్రీకాంత్ అనే యువకుడిదిగా గుర్తించిన పోలీసులు అతన్ని స్టేషన్ కు తీసుకువచ్చి విచారించగా ఈ ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటికే దారా శ్రీకాంత్ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టి, అనంతరం జోరంగుల పవన్ కళ్యాణ్ అనే యువకుడికి యువతిని అప్పగించి వచ్చాడు.

పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర నిరసనలు
నిందితుడు ఇచ్చిన వివరాలు మేరకు ఏప్రిల్ 20న అర్ధరాత్రి 11 గంటలకు ఆసుపత్రి వద్దకు చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు..తమ కూతురి కోసం గాలించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో, లిఫ్ట్ పక్కనే ఉన్న చిన్న గదిలో యువతిపై జోరంగుల పవన్ కళ్యాణ్ అత్యాచారం చేస్తూ పట్టుబడ్డాడు. తమ కళ్ల ఎదుటే..తమ కూతురిపై లైంగిక దాడి జరుగుతుండడంపై బాధిత తల్లిదండ్రులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మొదటిసారి ఫిర్యాదు సమయంలోనే పోలీసులు స్పందించి ఉంటే ఇంతటి ఘోరం జరిగేది కాదని..బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఒక అమాయకురాలి జీవితం నాశనం అయిందంటూ విమర్శలు వస్తున్నాయి.

దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్, దిశా వాహనాలు ఏమైపోయాయి?
అత్యాచారాలను అరికట్టేందుకు దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్, దిశా వాహనాలు అంటూ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చులు చేసింది. ఒక్క బటన్ నొక్కితే ఎక్కడున్నా క్షణాల్లో పోలీసులు వచ్చి రక్షిస్తారు అంటూ ఆర్భాటాలకు వెళ్లిన ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయినా బాధితులే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చినా న్యాయం జరగలేదంటే పోలీసులు ఎంతగా వైఫల్యం చెందారో అర్ధం అవుతుంది. ఇక ఈఘటనలో దారా శ్రీకాంత్, చెన్న బాబురావు, జోరంగుల పవన్ కళ్యాణ్ అనే ముగ్గురు నిందితులు అరెస్ట్ చేశారు.

ఘటనపై స్పందించిన ఆరోగ్య శాఖా మంత్రి రజని
విజయవాడ జిజిహెచ్ లో జరిగిన వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటనపై మరిన్ని చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజని అధికారులను ఆదేశించారు.శాఖా పరంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని డిఎంఇకి ఆదేశాలు జారీ చేశారు మంత్రి. భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని..ఆదేశించారు. నిందితులు ఫాగింగ్‌ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించారని వారిని వెంటనే విధులనుంచి తొలగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేశారు.

విజయవాడ జిజిహెచ్ లో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్‌ ఏజెన్సీకి టెర్మినేషన్‌ నోటీసు జారీ చేశారు.సీఎస్‌ ఆర్‌ఎంఓకి ఇప్పటికే అధికారులు షోకాజ్‌ నోటీసు జారీచేసారు. దీనిపై నివేదిక అందిన వెంటనే మరిన్ని చర్యలు తప్పవని వెల్లడించారు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజని.