సీనియర్లు తప్పుకోవాలి, టీడీపీ పోస్టుమార్టం చేసుకోవాలి – బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

సీనియర్లు తప్పుకోవాలి, టీడీపీ పోస్టుమార్టం చేసుకోవాలి – బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

AP Municipal elections

Buddha Venkanna : ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హావా కొనసాగింది. మెజార్టీ స్థానాల్లో విజయదుందుభి మ్రోగించింది. ఫ్యాన్ గాలికి విపక్షాలు గల్లంతయ్యాయి. టీడీపీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఎన్నికల ఫలితాలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఫలితాలపై టీడీపీ పోస్టుమార్టం చేసుకోవాలని, సీనియర్లు స్వచ్చందంగా తప్పుకోవాలని కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.

మున్సిపల్ ఎన్నికల్లో ఇంత దారుణమైన ఓటమి ఊహించలేదని, యువకులను ప్రోత్సాహించాలన్నారు. సీనియర్లు కుర్చీలు అంటిపెట్టుకుని ఉంటే..ఫలితాలు ఇలానే ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారాయన. ఇంత పెద్ద మొత్తంలో స్థానాలు వస్తాయని తాము ఊహించుకోలేదని, యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ యువకులు అంటే..వాళ్ల పిల్లలు, కోడళ్లు, కొడుకులు, అల్లుళ్లు, వాళ్ల కూతుర్లు కాదని..బయటి వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. ఈ విధంగా చేయడం వల్ల పార్టీ గట్టిగా ఉంటుందన్నారు.

ఏపీ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు చూస్తే. అంచనాలకు మించి విజయాలు సాధించింది వైసీపీ. ఆ జిల్లా..ఈ జిల్లా అన్న తేడా లేదు..ఆ వార్డూ.. ఈ వార్డు అన్న బేధం లేదు…ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా…ఏపీ ఓటర్లంతా ఫ్యాన్‌కే పట్టం కట్టారు. ఫ్యాన్ గాలి స్పీడుకు మిగిలిన పార్టీలు కకావికలమయ్యాయి. ప్రతిపక్ష టీడీపీ ఇప్పటిదాకా ఒక్క మున్సిపాలిటీని కూడా గెలుచుకోలేకపోయింది. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ ఏకపక్ష విజయాలు సాధించింది.