TDP NDA Alliance : ఎన్డీయేలో చేరికపై పార్టీ కేడర్కు చంద్రబాబు క్లారిటీ.. రాష్ట్ర ప్రయోజనాలను బట్టే పొత్తులపై నిర్ణయం
రాష్ట్ర ప్రయోజనాలను బట్టే పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు. సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
TDP NDA Alliance : ఎన్డీయేలో చేరికపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కేడర్ కు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను బట్టే పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు. సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీ శ్రేణులు క్లారిటీలో ఉండాలన్నారు. విభజన కంటే జగన్ పాలనలోనే ఏపీకి తీరని అన్యాయం జరిగిందని చంద్రబాబు వాపోయారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే ముందుకెళ్తామన్నారు.
టీడీపీ పొత్తులపై పార్టీ కేడర్ కు చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఇతర పార్టీలతో టీడీపీ పొత్తుల గురించి తాను ఇప్పటిదాకా మాట్లాడలేదని ఆయన వెల్లడించారు. రాష్ట్రం కోసం అవసరాన్ని బట్టి సమయానుకూలంగా పొత్తులపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. పొత్తుల గురించి తాను ఇప్పటివరకు మాట్లాడలేదన్న చంద్రబాబు.. ఈ విషయంపై పార్టీ నేతలకు స్పష్టత ఉండాలని తెలిపారు.
పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసం పని చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తద్వారా ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించాలన్నారు. ఎన్నికలు త్వరగా వస్తే రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతుందని వైసీపీపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. నెత్తిన ఉన్న కుంపటిని ఎప్పుడెప్పుడు దింపుకుందామా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారని చంద్రబాబు అన్నారు. పార్టీ కోసం పోరాడే నేతలు మరింత మంది తయారు కావాల్సి ఉందని, పార్టీలోని సీనియర్లు అలాంటి నేతలను తయారు చేసే బాధ్యతలను తీసుకోవాలని సూచించారు చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. 2014 సీన్ రిపీట్ కాబోతుందని.. టీడీపీ మళ్లీ బీజేపీతో దోస్తీ చేయబోతుందనే ప్రచారం నడుస్తోంది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. దీంతో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసే పోటీ చేస్తాయనే చర్చలు సాగుతున్నాయి. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా పొత్తులు ఖాయమనేలా వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు కూడా తాము త్యాగాలను సిద్ధమనే సంకేతం ఇచ్చారు. టీడీపీ నేతలైతే పొత్తులు ఖాయమయ్యానే అర్ధం వచ్చేలా మాట్లాడుతున్నారు. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం జరగబోతోందని.. ఎన్డీఏ కూటమిలోకి తిరిగి తెలుగుదేశం పార్టీ ఎంట్రీ ఇవ్వబోతుందనే ప్రచారం ఢిల్లీలో జోరుగా సాగుతోంది.
టీడీపీ రాష్ట్ర కమిటీ సమావేశం
మంగళగిరి: నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న టిడిపి రాష్ట్ర కమిటీ సమావేశానికి హాజరైన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు.. (1/2) pic.twitter.com/7IavJAUZYn
— Telugu Desam Party (@JaiTDP) September 2, 2022
ఎన్డీఏ కూటమిలోకి మళ్లీ టీడీపీ చేరబోతుందని ఓ జాతీయ మీడియాలో కథనం వచ్చింది. వచ్చే దసరా లేదా దీపావళి నాటికి బీజేపీ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ చేరుతుందన్నది ఆ కథనం సారాంశం.