రైతుల ఖాతాల్లోకి రూ.510 కోట్లు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ప్రారంభించిన సీఎం జగన్
ysr sunna vaddi scheme: సీఎం జగన్ మరో హామీని నిలబెట్టుకున్నారు. చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలిచారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం చెల్లింపులను సీఎం జగన్ మంగళవారం(నవంబర్ 17,2020) వర్చువల్గా ప్రారంభించారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లించారు. 14.58 లక్షల రైతుల ఖాతాల్లో 510 కోట్ల రూపాయలకు పైగా జమ చేశారు. అక్టోబర్లో దెబ్బతిన్న పంటలకు కూడా పెట్టుబడి రాయితీ విడుదల చేశారు. నెల రోజుల్లోపే 132 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేశారు. ఈ ఖరీఫ్లో పంట నష్టాలపై ఇప్పటివరకు పూర్తి ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులు జరిపారు.
‘రైతులకు ఎంత చేసినా తక్కువే. 18 నెలల్లోనే 90 శాతానికిపైగా హామీలు నెరవేర్చాం. రైతుభరోసా కింద రూ.13,500 ఇస్తున్నాం. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తున్నాం. రుణమాఫీ వాగ్దానాన్ని ఎలా అటకెక్కించారో గతంలో మనం చూశాం. గత ప్రభుత్వం సున్నావడ్డీపై పెట్టిన రూ.1,180 కోట్ల బకాయిలన్నింటినీ మేమే చెల్లించాం. ఏ సీజన్లో పంట నష్టపోతే.. అదే సీజన్లో రైతులను ఆదుకుంటున్నాం.
నెల రోజుల్లోపే రూ.132 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేశాం. అర్హత ఉండి అందకపోతే.. మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నాం. పగటిపూటి ఉచితంగా 9 గంటల విద్యుత్ ఇస్తున్నాం. రైతులకు బీమా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.147 ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నాం. పంటల కొనుగోలుకు రూ.3,200 కోట్లు ఖర్చు చేశాం. నవంబర్ 26న ప్రకాశం, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలో మొదటి విడత పాలసేకరణలో భాగంగా బల్క్ మిల్క్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం’ అని సీఎం జగన్ తెలిపారు.
అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే సున్నా వడ్డీ పథకం ప్రారంభించింది. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం త్వరితగతిన సాయం అందించడంలోనూ రికార్డు నెలకొల్పుతోంది. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలపై వడ్డీ రాయితీ (వైఎస్సార్ సున్నా వడ్డీ సాయం), గత నెలలో వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన వారికి పెట్టుబడి రాయితీ మొత్తాలను రైతుల ఖాతాల్లోకి జమ చేసింది ప్రభుత్వం. పంట నష్టపోయిన రైతులకు నెల రోజుల్లోపే పెట్టుబడి రాయితీ అందిస్తుండడం విశేషం.
https://10tv.in/state-election-commission-objected-to-the-formation-of-new-districts-in-ap/
2019 ఖరీఫ్ పంట రుణాలకు సంబంధించి దాదాపు 14.58 లక్షల మంది రైతులకు రూ. 510. 32 కోట్ల వడ్డీ రాయితీ, గత నెలలో ఖరీఫ్ పంటలు దెబ్బ తినడం వల్ల నష్టపోయిన రైతులకు రూ. 132.62 కోట్ల పెట్టుబడి రాయితీ కలిపి మొత్తం రూ. 642.94 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.
అక్టోబర్ లో దెబ్బతిన్న వ్యవసాయ పంటలు (హెక్టార్లలో) 73,707.97
నష్టపోయిన రైతులు : 1,66,608
దెబ్బతిన్న ఉద్యాన పంటలు (హెక్టార్లలో) 13,516.24
నష్టపోయిన రైతులు : 30,525
మొత్తం రైతులు : 1,97,133
జమ కానున్న పెట్టుబడి రాయితీ (రూపాయల్లో) : 132,62,32,000