ఇంద్రకీలాద్రిపై దిద్దుబాటు చర్యలు..13 మందిని సస్పెండ్ చేసిన ఈవో

ఇంద్రకీలాద్రిపై దిద్దుబాటు చర్యలు..13 మందిని సస్పెండ్ చేసిన ఈవో

Indrakeeladri 13 temple’s staff suspend : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈవో సురేష్‌బాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఏసీబీ సోదాల్లో అవినీతి అక్రమాలు వెలుగు చూశాయి. అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ గుర్తించిన 13 మంది ఆలయ సిబ్బందిని సస్పెండ్ చేశారు. దీంతోపాటు మరింత మందిపై చర్యలకు రంగం సిద్ధమైంది. వివిధ విభాగాలలో అక్రమాలు గుర్తించిన ఏసీబీ.. ఈవోకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ఇచ్చారు. అన్నదానం, చీరల గోడౌన్, ప్రొవిజన్‌ స్టోర్‌, ఆర్జిత సేవా కౌంటర్లల్లో సిబ్బందిపై వేటు వేశారు.

ఇంద్రకీలాద్రిలో ఇంటి దొంగలపై ఏసీబీ ఫోకస్‌ చేసింది. అమ్మవారి సొమ్మును అడ్డంగా దోచుకున్న అధికారుల లిస్ట్‌ రెడీ చేసింది. మూడ్రోజుల సోదాల్లో నాలుగేళ్ల ఫైల్స్‌ను తవ్వి తీసిన ఏసీబీ టీమ్స్‌… గత పాలకమండలి హయాంలో వచ్చిన ఆరోపణలపైనా రిపోర్ట్‌ రెడీ చేసింది. దుర్గ గుడిలో అక్రమాల్ని ఏసీబీ అధికారులు తవ్వితీశారు. మూడ్రోజులపాటు అన్ని విభాగాల్లో సోదాలు నిర్వహించి… అధికారుల అవినీతిపై కీలక సమాచారం రాబట్టారు.

ప్రస్తుత పాలకమండలి హయాంలో జరుగుతున్న పనులపైనే కాకుండా.. గత నాలుగేళ్ల ఫైళ్లను పరిశీలించారు. గత పాలకమండలి హయాంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో… అప్పట్లో జరిగిన అన్ని పనులకు సంబంధించిన ఫైళ్లను తవ్వి తీశారు. కొండపై అభివృద్ధి పనులు, ఇంజినీరింగ్‌, టెండర్ల పనుల డేటా సేకరించారు.

పక్కా సమాచారంతోనే రంగంలోకి ఏసీబీ అధికారులు దిగారని తెలుస్తోంది. రెండు కోట్ల రూపాయల విలువ చేసే స్క్రాప్‌ను కేవలం 40 లక్షలకే విక్రయించినట్లు గుర్తించారు. శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బంది టెండర్ల విషయంలో భారీగా అక్రమాలు జరిగినట్లు తేల్చాయి తేల్చారు. లడ్డూ ప్రసాదాలు, టిక్కెట్, చీరల కౌంటర్లతో పాటు టోల్ గేట్, కేశ ఖండనశాల, ప్రొవిజన్ స్టోర్, ఇంజనీరింగ్ విభాగాల్లో… ఏ ఫైల్‌ తీసినా అవినీతిమయమైనట్లు ఏసీబీ టీమ్స్‌ నిర్ధారించాయి.

దేవస్థానంలో ఏ పనిచేసినా.. వాటికి సంబంధించిన ఫైళ్లను ఈవో పరిశీలించాకే అప్రూవ్‌ చేయాలి. కానీ.. ఇంద్రకీలాద్రిపై ఇలాంటి రూల్స్‌ పాటించట్లేదని ఏసీబీ తేల్చింది. ఇక మూడ్రోజులుగా అవినీతి ఫైళ్లను తవ్వి తీసిన అధికారులు… ప్రతి విభాగంలోనూ అక్రమాలు జరిగినట్లు తేల్చారు. వీటిపై త్వరలోనే ఉన్నతాధికారులకు రిపోర్ట్‌ పంపించేందుకు రెడీ అవుతున్నారు.