Hyderabad Vijayawada Highway : హైదరాబాద్- విజయవాడ హైవేపైకి వరద నీరు.. ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిన రాకపోకలు
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద మూడు ఏర్లు కలిసి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. Heavy Rains
Hyderabad Vijayawada National Highway : తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. అక్కడ ఇక్కడ అని లేదు దాదాపుగా అన్ని చోట్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్థంభించింది. తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
భారీ వర్షాలకు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65)పైకి వరద నీరు చేరింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మున్నేరు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి. వందలాది వాహనాలు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి. కొందరు వాహనదారులు ప్రాణాలను పణంగా పెట్టి వరద నీటిలోనే తమ వాహనాలను ముందుకు నడిపిస్తున్నారు.
ఐతవరం వద్ద పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. కంచికచర్ల మండలం కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు వరద ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు కలుస్తాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద మూడు ఏర్లు కలిసి వరద ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.